Rajasthan: రౌడీలను హెచ్చరించిన ‘రాజస్థాన్‌ యోగి’

5 Dec, 2023 11:44 IST|Sakshi

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దీంతో బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు అనుభవం ఉన్న నేత, మాజీ సీఎం వసుంధర రాజే పేరు తెరపైకి వస్తుండగా, మరోవైపు బాబా బాలక్‌నాథ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఈ నేపధ్యంలో బాబా బాలక్‌నాథ్‌కి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో మరోమారు వైరల్‌ అవుతున్నాయి. 

బాబా బాలక్‌నాథ్ కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో నాథ్ శాఖ నుంచి వచ్చారు. బాబా బాలక్‌నాథ్ తీరుతెన్నులు కూడా యోగి మాదిరిగానే కనిపిస్తున్నాయి.  అందుకే అతను పగ్గాలు చేపడితే రౌడీలు పారిపోతారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో విలేకరులు ఆయనతో మీ పాలనలో ‘బుల్డోజర్ నడిపించి, రౌడీలను 24 గంటల్లో తరిమి కొడతారా?’ అని అడిగారు. దీనికి బాబా బాలక్‌నాథ్‌ సమాధానమిస్తూ, డిసెంబరు 3వ తేదీ తర్వాత రౌడీలెవరూ కనిపించరని నవ్వుతూ చెప్పారు.

మహంత్ బాలక్‌నాథ్‌ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగితో పోలుస్తున్నారు. అలాగే ఆయనను ‘రాజస్థాన్ యోగి’ అని కూడా పిలుస్తున్నారు. బాలక్‌నాథ్ 1984 ఏప్రిల్ 16న అల్వార్ జిల్లాలోని బెహ్రోర్ తహసీల్‌లోని కొహ్రానా  గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు సుభాష్ యాదవ్, వృత్తిరీత్యా రైతు. సుభాష్ యాదవ్ మతపరమైన భావాలు కలిగిన వ్యక్తి. అతను నీమ్రానాలోని బాబా కేదార్‌నాథ్‌కు సేవ చేసేవారు.

తన తండ్రిలాగే, మహంత్ బాలక్‌నాథ్‌కు కూడా చిన్నప్పటి నుండి మతపరమైన విషయాలపై ఆసక్తి మెండుగా ఉంది. అందుకే ఆరేళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించారు. మహంత్ బాలక్ నాథ్ ప్రస్తుతం అల్వార్ ఎంపీగా ఉన్నారు. బాబా మస్త్‌నాథ్ ఆశ్రమానికి మహంత్‌గా కొనసాగుతున్నారు. బాబా బాలక్‌నాథ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్య ధ్వజ స్థంభాల నిర్మాణం జరుగుతోందిలా..
 

>
మరిన్ని వార్తలు