'ఖద్దరు గుండెల్లో' కలవరం! అస‌లు నిర్ల‌క్ష్యం ఇదేనా..?

11 Dec, 2023 14:29 IST|Sakshi

నాయకులను వెన్నాడుతున్న హార్ట్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌లు!

రాజకీయంలో తీరిక లేక.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వైనం..

అనుకున్న లక్ష్యం చేరుకోలేక, అప్పుల పాలై..

చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్న నేతలు!

సాక్షి, కామారెడ్డి: పదవుల మీద వ్యామోహంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన వాళ్లలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో బీపీ, షుగర్‌ వంటి సమస్యలతో సతమతమవుతూ హార్ట్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌లకు గురవుతున్నారు. అలాంటి వారిలో కొందరు సమయానికి వైద్యం అంది ప్రాణాలతో బయట పడుతుండగా, మరికొందరు తనువు చాలిస్తున్నారు. కాలం కలిసిరాక పదవులు దరిచేరలేదనే వేదనకు గురై కొందరు, దర్పం కోసం అడ్డగోలు ఖర్చులు చేసి అప్పులపాలై అవస్థలు పడి మరికొందరు అనారోగ్యం పాలవుతున్నారు.

చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు బీపీ, షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోయి హార్ట్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌లకు గురవుతున్నారు. ఒక్కోసారి తీవ్ర ఒత్తిడితో గుండెనాళాల్లో రక్తప్రసరణ నిలిచిపోయి, బ్రెయిన్‌లో నరాలు చిట్లిపోయి సకాలంలో వైద్యం అందక ప్రాణా లు కోల్పోతున్నారు. రాజకీయంగా ఎదిగినవారే కాకుండా ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.

మెజారిటీ ప్రజాప్రతినిధులు, నాయకుల్లో బీపీ, షుగర్‌ సమస్య కామన్‌గా కనబడుతోంది. ట్యాబె ట్స్‌ వాడేవాళ్లు కొందరైతే, ఇన్సులిన్‌ తీసుకుంటున్నవారూ కొందరున్నారు. బీపీ, షుగర్‌ను కంట్రోల్‌ చేసుకునేందుకు కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు నిత్యం వ్యాయామం, యోగా చేస్తుండగా, ఇంకొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఏదైనా సమ స్య ఎదురైనపుడు తీవ్ర ఒత్తిడికి గురై హార్ట్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌లు వచ్చి తనువు చాలిస్తున్నారు.

ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు..
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన ఈగ గంగారెడ్డి తనకు ఏదైనా నామినేటె డ్‌ పదవి వస్తుందేమోనని ఆశపడ్డారు. ఏదీ దక్కలే దు. నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవ డంతో మానసిక వేదనతో పక్షవాతానికి గురై ఆస్ప త్రిపాలయ్యారు. అదృష్టం కొద్దీ బయటపడినా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోయారు.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి జెడ్పీటీసీ మిన్కూ రి రాంరెడ్డికి ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవి రావాలి. కానీ పదవి రాకపోవడంతో ఆయన మనోవేదనకు గురవగా, గుండె నాళాలు బ్లాక్‌ అయ్యాయి. సమయానికి ఆ స్పత్రికి వెళ్లడంతో స్టంట్‌లు వేశారు. దీంతో కోలుకున్నాడు. భిక్కనూరు జెడ్పీటీ సీ సభ్యురాలి భర్త, మాజీ స ర్పంచ్‌ నాగభూషణంగౌడ్‌ ఇటీవల బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

భిక్కనూరులో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న హన్మంత్‌రెడ్డి ఇటీవల కిడ్నీ సమస్యతో ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారు.భిక్కనూరు మార్కెట్‌ కమిటీ మా జీ చైర్మన్‌ బాణాల అమృతరెడ్డి కిడ్నీలు దెబ్బతినడంతో ఆయన భార్య కిడ్నీ ఇవ్వగా కోలుకున్నారు. ఇక్కడే మార్కెట్‌ చైర్మన్‌గా పనిచేసిన చిట్టెడి భగవంతరెడ్డి రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో తిరిగి ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రాణాలు కోల్పోయిన వారెందరో..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలువురు నాయకులు హార్ట్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌లతో ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లాలో అయితే గ్రామ, మండల స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గా పనిచేసిన వాళ్లు పలువురు ప్రాణాలు కో ల్పోయారు. గాంధారి మండలం గౌరారం సర్పంచ్‌గా పనిచేసిన మహేందర్‌ రెండేళ్ల కింద గుండెపోటుతో చనిపోయాడు.

ఇటీవల జనగామ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సంపత్‌రెడ్డి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కొంత కా లం కిందటే ములుగు జెడ్పీ చైర్మన్‌ జగదీశ్‌ గుండెపోటుతో చనిపోయారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పనిచేసిన పాలమూరు జిల్లాకు చెందిన గాయకుడు సాయిచంద్‌ ఇటీవల గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.

ఒత్తిడిని అధిగమిస్తేనే..
రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లలో కొందరు అవకాశాలు అందింపుచ్చుకుని తక్కువ కాలంలో ఎదుగుతున్నారు. వాళ్లను చూసి తాము కూడా స్థాయికి మించిన ఆలోచనలు చేస్తున్నారు. కొందరు దశాబ్దాలు కష్టపడినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అలాగని అందరిదీ అదే పరిస్థితి అని కాదు. కానీ కొందరు ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆరాటంతో అడ్డగోలుగా ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు.

తాము పెట్టుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఆందోళనకు గురై ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అత్యాశకు పోకుండా, స్థాయికి మించి ఆలోచనలు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్‌, యోగా, వాకింగ్‌ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు