వైఎస్సార్‌ 14వ వర్థంతి: న్యూజిలాండ్‌లో రక్తదాన శిబిరం

4 Sep, 2023 11:36 IST|Sakshi

సెప్టెంబర్ 2, రోజులానే తెల్లారింది ఎవరి పనుల్లో వాళ్ళు నిమిత్తం అయ్యి ఉన్నారు. కొద్దిసేపటికే వైయస్సార్ గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయ్యిందని వార్తలు. జనాల్లో ఆందోళన ఎక్కడో ఒక చోట వాతావరణం అనుకూలించక ల్యాండ్ అయ్యి ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారికి ఏమి కాదు ఇంత మంది జనహృదయాల్లో నిలిచిన రాజశేఖర్ రెడ్డికి ఏమి కాదన్న భరోసా ఒకవైపు. నల్లమల కొండల్లో వెతుకులాట కోసం వేలాది జనాలు మంది వెళ్లారు. చివరికి నేవి హెలికాప్టర్ల గాలింపులో సెప్టెంబర్ 3న ఆచూకీ తెల్సింది కానీ.. అభిమానుల గుండె పగిలింది. చరిత్రలో సెప్టెంబర్‌ 2, 3 అలా చెరగని గుర్తు వేశాయి. పెద్దాయన అంత్యక్రియలకు దారులన్ని మూసుకుపోయాయి. అభిమానం పోటెత్తింది. కడసారి చూపు కోసం రోదించింది. గొంతు మూగబోయింది, మాకు దిక్కెవరని కన్నీరు పెట్టనివారు లేరు. 

అందుకే దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారు.. ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటారు. ఆ మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్‌ వైఎస్సార్‌ సీపీ ఎన్నారై విభాగం నివాళులు అర్పించింది. శనివారం సెప్టెంబర్‌ 2వ తేదీన ఎన్‌ఆర్‌ఐ కమిటీ సభ్యులు బుజ్జిబాబు(కన్వీనర్‌), ఆనంద్‌ ఎద్దుల(రీజినల్‌ కో ఆర్డినేటర్‌) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌లోని వెస్టీ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగింది.

ఈ సందర్భంగా  ఆనంద్ ఎద్దుల, సుస్మిత చిన్నమల్రెడ్డి, సమంత్ డేగపూడి, ప్రభాకర్ వాసిపల్లి, విజయ్ అల్లా, పవన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ అన్నమరాజు, ఆరోన్ శామ్యూల్ తదితర ఎన్నారైలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్‌ వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం సభ్యుల కృషిని ఆంధ్రప్రదేశ్‌ అధికార వైఎస్సార్‌సీపీ నాయకులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ బాబు, శ్రీకాహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఏపీ ఎన్నారై సొసైటీ ప్రెసిడెంట్‌ వెంకట్ మేడపాటి, తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్‌ లక్ష్మీ పార్వతి, ఏపీ ప్రెస్‌ అకాడమీ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహదారు అలీ తదితరులంతా అభినందించారు. 

ఒక మనిషి మరణం ఎంతో మందిని చీకట్లోకి నెట్టివేసింది. బహుశా ఇవాళ్టికి కూడా చాలా మంది ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే అది ఆయన చేసిన పరిపాలన, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం. డబ్బు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం అని చేతల్లో నిరూపించిన నాయకుడు వైఎస్సార్. ఇంకో 100 ఏళ్ళు అయిన రాజశేఖర్ రెడ్డి మాత్రం మరువలేరేమో.

(చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్‌ ఎన్నారైల భావోద్వేగం)

మరిన్ని వార్తలు