విజయనగరం టౌన్: ఉత్తరాంధ్ర సినీ నిర్మాతలు ఈ ప్రాంత కళాకారులు, దర్శకులకు అవకాశాలిచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కోఆర్డినేటర్, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు , దర్శకుడు ఎంఎస్ఎస్.బాషా బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఫైబర్నెట్ ద్వారా సినిమాలను రిలీజ్ రోజునే ప్రతి పల్లెలో చూసే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్రెడ్డి చొరవతో కల్పించారని, చిన్న సినిమాలకు, థియేటర్స్ దొరక్క ఇబ్బంది పడుతున్న నిర్మాతలు, దర్శకులకు సీఎం తీసుకున్న నిర్ణయం వరం కాబోతుందన్నారు. చిన్న సినిమాలు నిర్మించే దర్శకులకు సినిమా నిర్మాణంలో ఎదురైన ఏ సమస్యనైనా పరిష్కరించి, వారికి వెన్నుదన్నుగా ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుందని, ఉత్తరాంధ్ర నుంచి చిన్న, పెద్ద సినీ నిర్మాతలు వారి సినిమాలను నూటికి నూరు శాతం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోనే చిత్రీకరించుకునే వసతులు, వాతావరణం అనుకూలంగా ఉన్నాయన్నారు.