పార్వతీపురంటౌన్: వచ్చే ఏడాది జరగనున్న పదోతరగతి పరీక్షల్లో ఉత్తమఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు బోధన సాగించాలని డీఈఓ ఎన్.ప్రేమ్కుమార్ సూచించారు. పట్టణంలోని కేపీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పార్వతీపురం డివిజన్ ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో శనివారం నిర్వహించిన అభ్యసనాభివృద్ధి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచాలన్నారు. ప్రతి విద్యార్థి అధికమార్కులు సాధించేలా పాఠ్యాంశబోధన సాగాలన్నారు. జిల్లాలోని 182 ఉన్నత పాఠశాలల పర్యవేక్షణకు మండల, డివిజన్, జిల్లాస్థాయి అధికారులను నియమిస్తూ కలెక్టర్ నిషాంత్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ జె.నారాయణస్వామి, ఏఎంఓ సీహెచ్ శ్రీనివాసరావు, కె.జనార్దన, రమణమూర్తి, విమలా కుమారి, తదితరులు పాల్గొన్నారు.