బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవినీతిపై విచారణ జరిపిస్తాం

19 Nov, 2023 04:09 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ సర్కారు లోక్‌ తంత్రాన్ని లూటీ తంత్రంగా మార్చేసింది: అమిత్‌షా 

వారి అవినీతి చిట్టా చాలా పెద్దది 

ప్రజల నుంచి కొల్లగొట్టిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు 

తాంత్రికుల సలహాతో పార్టీ పేరు మార్చిన చరిత్ర కేసీఆర్‌ది 

కాంగ్రెస్‌ చాలా ఏళ్లు తెలంగాణను అవహేళన చేసింది 

అధికారం చివర్లో రాజకీయ లబ్ధికోసం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది

గెలవగానే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తాం 
పెట్రోల్‌ ధరల తగ్గింపులో రాష్ట్రం, కేంద్రం కలసి పనిచేస్తే పేదలపై భారం తగ్గుతుంది. కేంద్రం తగ్గించినా కేసీఆర్‌ ఎందుకు తగ్గించడం లేదు? రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గిస్తాం.

ఏం చెప్పామో చేసి చూపిస్తాం.. 
బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో. ఇది మోదీ గ్యారంటీ. బీజేపీని నెలకొల్పి నప్పటి నుంచి నేటి వరకు.. ఎక్కడైనా మా మేనిఫెస్టోలలో పెట్టిన అంశాలను ఐదేళ్లలోపు పూర్తిచేశాం. ఆర్టీకల్‌ 370 రద్దు అయినా, రామమందిర నిర్మాణమైనా, త్రిపుల్‌ తలాక్‌ రద్దు అయినా, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యయ సూచించిన అంత్యోదయ విధానమైనా..చేసి చూపించాం..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి సహా వివిధ అవినీతి, కుంభకోణాల ఆరోపణలపై విచారణ జరిపిస్తామని.. ఇందుకోసం సుప్రీంకోర్డు రిటైర్డ్‌ జడ్జి ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. తమ అవినీతి వ్యతిరేక పోరాటం తెలంగాణలో కూడా శక్తివంతంగానే నడుస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చివరిదశకు చేరినా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చర్య తీసుకోవడం బీజేపీ సంస్కృతి కాదని పేర్కొన్నారు.

విచారణ పూర్తికాగానే తప్పు జరిగిందని తేలిన చోట కచ్చితంగా చర్యలు ఉంటాయని.. అదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చామని చెప్పారు. పదేళ్ల పాలనలో కేసీఆర్‌ సర్కారు అన్నిరంగాల్లో విఫలమైందని ఆరోపించారు. శనివారం రాత్రి బీజేపీ మీడియా సెంటర్‌లో ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ–2023.. మన మోదీ గ్యారంటీ.. బీజేపీ భరోసా’ట్యాగ్‌లైన్‌తో పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్‌షా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్‌ ప్రభుత్వం అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాల విరోధి సర్కార్‌. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ ఇప్పుడు మూడోసారి మళ్లీ గద్దె ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినపుడు రూ.370 కోట్ల మిగులు బడ్జెట్‌ ఉన్నది కాస్తా.. ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల పైచిలుకు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సాధారణంగా రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడితే వాటి వల్ల ప్రజలకు ఏమేరకు ప్రయోజనం కలుగుతుందని ఆలోచిస్తారు.

తెలంగాణలో మాత్రం మరింతగా కమీషన్ల కోసం ప్రాజెక్టుల పరిమాణాన్ని, అంచనా వ్యయాలను భారీగా పెంచారు. ఇది కేసీఆర్‌ కుటుంబ అవినీతికి తార్కాణం. తాంత్రికుల సలహాతో పార్టీ పేరును మార్చిన చరిత్ర కేసీఆర్‌ది. íప్రజలు ఆలోచించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఖర్చుచేస్తున్న డబ్బంతా ప్రజలదే. తెలంగాణ నుంచి సంపాదించిన డబ్బును కేసీఆర్, కర్ణాటకలో కొల్లగొట్టిన మొత్తాన్ని కాంగ్రెస్‌ ఖర్చు చేస్తున్నాయి. 

అవినీతి చిట్టా పెద్దదే.. 
కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణలో లోక్‌తంత్రానికి (ప్రజాస్వామ్యం) బదులు లూటీతంత్రంగా, ప్రజాతంత్రం కాస్తా పరివార్‌ (కుటుంబ పాలన) తంత్రంగా మారిపోయింది. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతికి అంతులేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మద్యం కుంభకోణం, పౌల్ట్రీ దాణా, గ్రానైట్, బైపాస్‌ రోడ్ల కుంభకోణం, మిషన్‌ కాకతీయ.. అవినీతి చిట్టా పెద్దదే.

కేసీఆర్‌కు కేటీఆర్‌ను సీఎం చేయడం, కుమార్తె కవిత గురించి ఆలోచించడం తప్ప.. ప్రజల అభ్యున్నతి గురించి ఎలాంటి ఆలోచన లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ నినాదం. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మునిగింది. పాలమూరు–రంగారెడ్డికి రూ.32,250 కోట్లు ఖర్చుచేసినా పనికాలేదు.

నిధులు కేటాయించలేదు. ఉద్యోగాల పరీక్షలు 17 సార్లు వాయిదా పడ్డాయి. రెండు లక్షలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన రూ.3,016 భృతి అమల్లోకి రాలేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు కాలేదు. 7 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చి అమలు చేయలేదు. రైతులకు రుణమాఫీ కాలేదు. 

కాంగ్రెస్‌ తెలంగాణను అవహేళన చేసింది 
ప్రధానిగా వాజ్‌పేయి ఉన్నప్పుడు మేం మూడు రాష్ట్రాలిచ్చాం. ఎక్కడా ఏ గొడవా కాలేదు. కానీ ఏళ్లుగా తెలంగాణ డిమాండ్‌ను కాంగ్రెస్‌ అవహేళన చేస్తూ వచ్చింది. చివరికి ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం అధికారం చివరిలో తొందర తొందరగా తెలంగాణ ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బీజేపీకి కీలకపాత్ర ఉంది. పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ఇచ్చాం. ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన దానితో పోల్చితే 2014 నుంచి మోదీ సర్కారు 160 శాతం ఎక్కువగా తెలంగాణకు కేటాయింపులు చేసింది.

సమ్మక్క–సారక్క గిరిజన సెంట్రల్‌ యూనివర్సిటీ ఇచ్చాం. పసుపుబోర్డు ఇచ్చాం. కృష్ణా జలాల వివాద పరిష్కారానికి చొరవ తీసుకున్నాం. నేషనల్‌ హైవేలు, వందేభారత్‌ రైళ్లు ఇచ్చాం. మా హయాంలో ఒక్క కుంభకోణం కూడా లేదు..’’అని అమిత్‌షా పేర్కొన్నారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్, పార్టీ తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ కన్వినర్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

బీసీ సీఎం అన్నందుకే పార్టీ వీడారు 
బీజేపీ బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్తోందని, అందుకే రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, వివేక్‌ వంటివారు పార్టీ మారారని అమిత్‌షా చెప్పారు. వాళ్లు పార్టీ మారింది స్వప్రయోజనాల కోసమేనని, వారి కోసం తాము విధానాలను మార్చుకోలేం కదా! అని పేర్కొన్నారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అమిత్‌షా సమాధానమిచ్చారు.

కేసీఆర్‌ అవినీతిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించగా.. ‘‘ కేసీఆర్‌ అవినీతిపై దర్యాప్తు సంస్థలు యాక్షన్‌ తీసుకుంటాయి..’’ అని సమాధానమిచ్చారు.‘‘తెలంగాణలో కట్టలు కట్టలు డబ్బులు దొరుకుతున్నాయి. వాటిపై కేసీఆర్‌ను, కాంగ్రెస్‌ను ప్రశ్నించాలి. ఆ డబ్బులన్నీ తెలంగాణ ప్రజలవి. వారంతా ప్రశ్నించాలి..’’ ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. అధికారానికి వస్తామని ఎలా చెప్పగలుగుతున్నారని అడగగా.. ‘డిసెంబర్‌ 3 తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరో మీరే చూస్తారు..’’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు