Akhilesh Yadav: తొలిసారి అఖిలేష్‌ పోటీ.. బరిలోకి బఘేల్‌.. బీజేపీ ఎత్తుగడ ఫలించేనా?

31 Jan, 2022 18:08 IST|Sakshi

BJP Fields Union Minister SP Singh Baghel against Akhilesh Yadav from Karhal Seat: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌కు పోటీగా బీజేపీ బలమైన అభ్యర్థిని ప్రకటించింది. ఓబీసీ వర్గానికి చెందిన సత్యపాల్‌ సింగ్‌ బఘేల్‌ కర్హల్‌ నుంచి ఎన్నికల బరిలోకి దింపుతోంది. పోలీస్‌ ఎస్‌ఐగా తన కెరీర్‌ ప్రారంభించిన ఎస్పీ సింగ్‌ బఘేల్‌.. మాజీ సీఎం, ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఎస్పీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం బీఎస్పీలో చేరిన ఎస్పీ సింగ్‌ బఘేల్‌కు 2014లో మాయావతి రాజ్యసభ సీటు ఇచ్చారు.

అనంతరం కమలం పార్టీలో చేరిన ఎస్పీ సింగ్‌ బఘేల్‌.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తుండ్లా స్థానం నుంచి గెలిచి.. యోగి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆగ్రా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మోదీ కేబినెట్‌లో న్యాయ శాఖ సహా మంత్రిగా పనిచేస్తున్నారు. మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న అఖిలేష్‌కు పోటీగా బఘేల్‌ను రంగంలోకి దింపడంతో కర్హల్‌ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

చదవండి: (అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం)

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నామినేషన్‌ దాఖలుచేశారు. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్‌ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేస్తున్నారు. శాసనసభకు తొలిసారి పోటీచేస్తున్న అఖిలేష్‌.. మెయిన్‌పురి సబ్‌డివిజన్ ఆఫీస్‌లో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. కర్హాల్ స్థానం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో దాదాపు 3.5లక్షలమంది ఓటర్లు ఉండగా.. ఇందులో దాదాపు లక్షన్నర వరకూ యాదవులే ఉన్నారు. కర్హాల్ స్థానానికి మూడోదశలో ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది.

చదవండి: (బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్‌ అవుతారా?)

మరిన్ని వార్తలు