బీజేపీ వెనకడుగు.. కేసీఆర్‌ వైఫల్యాలపై రివర్స్‌ అటాక్‌కు ‘నో’

7 Jun, 2023 08:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ‘దశాబ్ది’ఉత్సవాలకు కౌంటర్‌గా ‘రివర్స్‌ గేర్‌’ కార్యక్రమాలు నిర్వహించాలనే యోచనను కమలదళం విరమించుకుంది. కేసీఆర్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై రాష్ట్ర పార్టీ చేపట్టాలని భావించిన ఎదురుదాడి కార్యక్రమాలకు బీజేపీ హైకమాండ్‌ నో చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనపై నిర్వహిస్తున్న ‘మహా జనసంపర్క్‌ అభియాన్‌’లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపైనే ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది.

జాతీయ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మే 30 నుంచి జూన్‌ 30 దాకా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో నెగిటివ్‌ ప్రచారం వద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులపాటు నిర్వహిస్తున్న అధికార కార్యక్రమాలకు వ్యతిరేకంగా కేసీఆర్‌ సర్కార్‌ తీరును ‘రివర్స్‌ గేర్‌’ నిరసనలతో ఎండగట్టాలని రాష్ట్ర బీజేపీ తొలుత నిర్ణయించిన విషయం తెలిసిందే.  అయితే తొమ్మిదేళ్ల మోదీ పాలనపై పాజిటివ్‌ ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించి ప్రజల్లోకి వెళ్లాలని అధినాయకత్వం సూచించింది.

దీంతో బీఆర్‌ఎస్‌పై రివర్స్‌గేర్‌ కార్యక్రమాలు రద్దయినట్టు సమాచారం. బీఆర్‌ఎస్, బీజేపీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలకు ఊతమిచ్చేలా ప్రస్తుత పరిణామాలు ఉండటం పార్టీ నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని భావిస్తున్నారు. జన సంపర్క్‌ అభియాన్‌ ముగియగానే మళ్లీ కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతామని పార్టీ నాయకులు చెబుతున్నారు.   
చదవండి: Secunderabad: పలు రైళ్లు రద్దు.. వివరాలివే!

మరిన్ని వార్తలు