పరామర్శకైనా పనికిరామా?

31 Oct, 2023 02:31 IST|Sakshi

టికెట్‌ ఆశించి భంగపాటుకు గురైన కమలనాథుల ఆవేదన

పార్టీ పెద్దలు తమను పిలిపించి మాట్లాడకపోవడంపై ఆవేదన

భవిష్యత్‌లో గుర్తింపు లభిస్తుందని భరోసా కల్పించకపోవడంపై మండిపాటు

అలాంటప్పుడు ఆశావహుల నుంచి దరఖాస్తులు ఎందుకు కోరారని నిలదీత

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న క్రమంలో బీజేపీలో టికెట్ల చిచ్చు రగులుతోంది. రెండు జాబితాల్లో కలిపి 53 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాక, నవంబర్‌ 1న మూడో జాబితా వెలువడనున్న నేపథ్యంలో బీజేపీ టికెట్లు ఆశించి భంగపడిన పలువురిలో అసంతృప్తి వ్యక్త మౌతోంది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో కనీసం 60–70 చోట్లయినా సీరియస్‌గా టికెట్‌ ఆశిస్తున్న వారు ఇద్దరు, ముగ్గురున్నప్పుడు అభ్యర్థిత్వం ఖరా రుకాని వారిని పిలిచి మాట్లాడే పరిస్థితి పార్టీలో లేకపోవడాన్ని తప్పుబడు తున్నారు.

గతంలో టికెట్‌ రాని వారికి నచ్చజెప్పి పార్టీ కోసం పని చేసేలా ఒప్పించిన పరిస్థితులుండగా ఇప్పుడు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు పట్టించుకోక పోవడం సరికాదని మండిపడుతున్నారు. కనీసం బుజ్జగింపులు, నచ్చజెప్ప డాలు వంటి వాటికి కూడా తాము నోచుకోలేదని పలువురు బీజేపీ నేతలు వాపోతున్నారు. పరామర్శకైనా తాము పని కిరామా అని ఆవేదన చెందుతున్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ విజయం సాధ్యమనే విష యాన్ని నాయకులు విస్మరించారని అంటున్నారు.  

గుర్తింపుపై భరోసా ఏదీ?
ఇప్పుడు వివిధ సమీకరణల మధ్య టికెట్‌ ఇవ్వలేక పోయామని, భవిష్యత్‌లో గుర్తింపు లభిస్తుందని భరోసా కల్పించకపోవడంపైనా పలువురు కమలనాథులు రుసరుసలాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామనే హామీ కూడా ఇవ్వకపోవడం దేనికి సంకేతమని అంటున్నారు. అలాంటప్పుడు ఆశావహుల నుంచి దరఖాస్తులు కోరాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని నాయకత్వం కోరడంతో రికార్డు స్థాయిలో 6,003 దరఖాస్తులు వచ్చాయి. వారిలో తొలి జాబితాలో టికెట్లు దక్కని వారిని పార్టీపరంగా అనునయించే ప్రయత్నమేదైనా జరిగిందా అని నిలదీస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి వెంటనే అవకాశం కల్పించి, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

రాజీనామా చేస్తానని ప్రకటించినా...
ముథోల్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన పార్టీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి రాజీనామా చేస్తానని ప్రకటించాక కూడా ఎవరూ సర్దిచెప్పే ప్రయత్నం చేయలేదనే చర్చ పార్టీ వర్గాల్లో సాగు తోంది. తొలిజాబితాలో తనకు ఆందోల్‌ టికెట్‌ను ప్రకటించకపోవడంపై మాజీ మంత్రి బాబూ మోహన్‌ ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు. ఏదైనా భరోసా దొరుకుతుందేమోనని ముఖ్యనేతలకు ఫోన్‌ చేసినా వారి నుంచి స్పందన కరువైందని ఆయన వాపోయారు.

వరంగల్‌(పశ్చిమ) నుంచి రావు పద్మకు టికెట్‌ కేటాయించడంతో... టికెట్‌ ఆశించి భంగపడిన అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి రెబెల్‌గా పోటీచేస్తానని ప్రకటించారు. అయినా ఆయనను నచ్చజెప్పేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే తరహా పరిస్థితులు మరికొన్ని నియోజక వర్గాల్లోనూ ఉన్నాయి. తదుపరి జాబితా ప్రకటించే సమయంలోనైనా టికెట్లు ఆశిస్తున్న ముఖ్యనే తలతో పార్టీ పెద్దలు మాట్లాడాలని ఓ ముఖ్యనేత సాక్షితో చెప్పారు. 

మరిన్ని వార్తలు