సామాజిక విప్లవ సారథి జగన్‌కు జేజేలు

29 Oct, 2023 06:03 IST|Sakshi

మూడో రోజూ ప్రభంజనంలా వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర

భీమిలి, బాపట్ల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో యాత్రకు విశేష స్పందన

రేపు పాడేరు, దెందులూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, బాపట్ల/సాక్షి, కడప: సామాజిక విప్లవ సారథి వైఎస్‌ జగన్‌ పరిపాలనకు ప్రజలు అడుగడుగునా జేజేలు పలుకుతున్నారు. వైఎస్సార్‌­సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రను  హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు.  ‘జగనన్నే మా భవిష్యత్తు.. జగనే రావాలి.. జగనే కావాలి’ అంటూ అన్ని వర్గాలూ ఒక్క గళమై నినదిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ సామా­జిక సాధికార బస్సు యాత్రకు మూడో రోజు శనివారం ప్రజలు నీరాజనం పలికారు. గత 53 నెల­లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద­లకు చేస్తున్న మంచిని వివరించడానికి సీఎం  జగన్‌ నాయకత్వంలో వైఎస్సార్‌­సీపీ చేపట్టిన సా­మా­జిక సాధికార యాత్ర శనివా­రం విశాఖ జిల్లా భీమిలి, బాపట్ల జిల్లా బాపట్ల, వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూ­రులో జరిగింది. ఈ బస్సు యా­త్ర సోమవారం అల్లూరి సీతారామ­రాజు జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా దెందులూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాల్లో జరగనుంది. 

బాపట్లలో అపూర్వ స్పందన
బాపట్ల నియోజకవర్గంలో బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభించింది. యాత్రకు ప్రజలు పూల తివాచీలతో ఘనస్వాగతం పలికారు. బస్సు యాత్ర నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, సంగుపాలెం కోడూరు గ్రామాల మీదుగా మధ్యా­హ్నం 1.10 గంటలకు చందోలులోని శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరింది. అక్కడ అమ్మ­వా­రికి నేతలు పూజలు చేశారు.

పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చందోలులోని నీలి బంగారయ్య ఉన్నత పాఠశాలలో పూర్తి చేసిన నాడు–­నేడు పనులను పరిశీలించారు. విద్య, వైద్యం తదితర విభాగాల్లో జరిగిన అభివృద్ధిని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు వివరించారు. యాత్ర రెడ్డిపాలెం, కర్లపాలెం మీదుగా సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల చేరుకుంది. నియోజకవర్గంలో­ని యువకులు అధిక సంఖ్యలో ద్విచక్ర­వాహ­నాల­తో భారీ ర్యాలీ చేశారు. అంబేడ్కర్‌ సెంటర్‌లో సభ జరిగింది. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేస్తున్న మేలును మంత్రులు వివరించిన సమయంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

జనసంద్రంగా మారిన పసిడిపురి
పసిడిపురి ప్రొద్దుటూరులో సామాజిక సాధికార యాత్ర జనజాతరలా సాగింది. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని వైవీఆర్‌ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర బైపాస్‌ రోడ్డు మీదుగా రామేశ్వరం వైపు సాగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివ­ప్రసాదరెడ్డి నియోజకవర్గ నేతలతో కలిసి బస్సు ముందు  నడుస్తుండగా మహిళలు వైఎస్సార్‌సీపీ జెండాలతో స్వాగతం పలికారు. యువత భారీ బైక్‌ ర్యాలీ చేశారు.

రామేశ్వరంలోకి బస్సు చేరుకోగానే బాణాసంచా కాల్చారు. వన్‌­టౌన్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో ముస్లిం మైనా­ర్టీలు పెద్ద సంఖ్యలో స్వాగ­తం పలికారు. రాజీవ్‌ సర్కిల్‌ వద్ద ప్రజలు గజమా­లతో స్వాగతం ప­లికారు. శివాలయం సెంటర్‌లో అసంఖ్యాక జనం మధ్య బహిరంగ సభ జరిగింది. దసరా ఉత్సవా­లకు పసిడిపురి పెట్టింది పేరు. భారీ స్థాయిలో ప్రజానీకం వీటిని వీక్షిస్తుంటారు. శనివా­రం సామాజిక సాధికార యాత్ర కూడా ఇదే ఉత్స­వాలను తలపించింది. శివాలయం సెంటర్‌ నుంచి కనుచూపు మేర రోడ్డుకు ఇరువైపులా ప్రజానీకం నిల్చొని నేతల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. 

భీమిలిలో 2వేల బైక్‌లతో భారీ ర్యాలీ
భీమిలిలో స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస­రావు ఆధ్వ­ర్యంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను ఎండాడలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగా ర్జున, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వర­రావు ప్రారంభించారు. అక్కడ నుంచి చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ‘నాడు–నేడు’ పనులను నాయకులు పరిశీలించారు.

విద్యార్థులతో ముచ్చటించారు. ఆనందపురం మండలం బోయి­పాలెం కూడలి నుంచి 2 వేలకు పైగా బైక్‌లు, వందకు పైగా కార్లతో ర్యాలీ­గా యాత్ర ప్రారంభమై హైవే మీదుగా  తగరపువలస చిట్టివలస ఫుట్‌బాల్‌ గ్రౌం­డ్‌ వద్ద బహిరంగ సభాస్థలి వద్దకు చేరింది. అక్కడ కూడలిలో అంబేడ్కర్‌ విగ్ర­హానికి నివా­ళులర్పించి బహిరంగ సభ వద్ద వైఎస్సార్‌ విగ్ర­హాలకు నివాళర్పించి మంత్రులు ప్రసంగించారు. 

మరిన్ని వార్తలు