దళిత బంధు తెచ్చిన మొనగాడు ఎవరైనా ఉన్నారా? కేసీఆర్‌

1 Nov, 2023 15:34 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. ప్రతీసారీ దళితులు మోసానికి గురయ్యారని తెలిపారు. చాలా రాష్ట్రల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్య దేశమా? అని ప్రశ్నించారు. ఎన్నికలులు వస్తుంటాయి, పోతుంటాయని.. పార్టీ ప్రజలకు ఏం చేసిందో గమనించి ఓటు వేయాలన్నారు.

దళిత బంధు పథకం తెచ్చిన మొనగాడు ఎవరైనా ఉన్నారా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నట్లు తెలిపారు. సత్తుపల్లిలో 70 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దళితుల శ్రేయస్సు గురించి ఎవ్వరూ ఆలోచించలేదన్న కేసీఆర్‌.. దళితుల అభివృద్ధి కోసం దళిత బంధుతెచ్చామని తెలిపారు.
చదవండి: గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణమిదే!

‘సత్తుపల్లి చాలా చైతన్యం ఉన్న ప్రాంతం.. ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొందరు ఏవేవో చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ గేటు తాకనీయం అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో మీ ఆయుధం మీ ఓటు. ఓటు వేయడంలో మీదే స్వతంత్ర నిర్ణయం. అహంకారపూరితంగా మాట్లాడేవాళ్లకు బుద్ధి చెప్పండి. డబ్బు, మందు పంచితే ఓట్లు వేసేస్తారా?. నాలుగు డబ్బులు రాగానే అహంకారంగా మాట్లాడుతున్నారు. డబ్బు, అహంకార రాజకీయాలు ఎన్నాళ్లు చెల్లుతాయి.

గతంలో కరెంట్‌ ఏ విధంగా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది. దేశంలో 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ప్రధాని మోదీకి ప్రవేటైజేషన్‌ తప్ప మరేం తెలీదు. నాలుగు డబ్బులు రాగానే అహంకారంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెసోళ్లు వస్తే ధరణీని తీసేస్తారంట. ధరణి లేకుంటే రైతుబంధు డబ్బులకు ఇబ్బంది పడాల్సిందే. ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది. ధరణి ఉండాలా.. వద్దా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు