CM Revanth Reddy: ముందుగానే ఎన్నికలు.. ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

18 Dec, 2023 17:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికలు నెల రోజుల మందే రావచ్చని రేవంత్‌ అన్నారు. అలాగే, సంక్రాంతి తర్వాత కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. 

కాగా, సీఎం రేవంత్‌ రెడ్డి పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్ల అంశం అధిష్టానం చూసుకుంటుంది. నామినేటెడ్‌ పదవుల ఎంపిక బాధ్యత ఇంఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులదే. నెల రోజుల్లో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఉంటుంది. మన పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని కాకుండా, మన కోసం పనిచేసిన అందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందే. సంక్షేమ పథకాల అమలు బాధ్యత జిల్లా ఇంఛార్జ్‌లదే. మన కార్యకర్తలు సంతృప్తి చెందేలా పనిచేద్దాం. మనం బీఫార్మ్‌ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు అందాలి. గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరగాలి అని కామెంట్స్‌ చేశారు. 

ఇక అంతకుముందు.. గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశానికి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు. తెలంగాణలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశాం. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల అసెంబ్లీ వేదికగా వివరిస్తాం. సభలో మంత్రి భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్‌ ఇస్తారు. త్వరలోనే గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామన్నారు. 

>
మరిన్ని వార్తలు