ప్రచారంలో బీజేపీ స్పీడ్‌.. కాంగ్రెస్‌పై సీఎం యోగి ఫైర్‌.. 

5 Nov, 2023 13:47 IST|Sakshi

రాయ్‌పూర్‌: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పార్టీలు ఫుల్‌ బిజీగా ఉన్నాయి. మరోవైపు.. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అక్కడ బీజేపీ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా కవార్ధాలో బీజేపీ సభలో సీఎం యోగి మాట్లాడుతూ..‘ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కొనసాగుతోంది. అక్కడ లవ్‌ జిహాద్‌ పూర్తిగా నిషేధం. దీనికి వ్యతిరేకంగా చట్టం చేశాం. ఛత్తీస్‌గఢ్‌లో కూడా లవ్‌ జిహాద్‌, గోవుల అక్రమ రవాణా, మైనింగ్‌ మాఫియాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్‌ను ఇంటికి పంపి.. బీజేపీని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుంది. ఇక్కడ కూడా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని మిమ్మల్ని కోరుతున్నాను. 

ఆనాడు ప్రధాని వాజ్‌పేయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం చొరవతో ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడింది. రమణ్‌ సింగ్‌ నాయకత్వంలో 15 ఏళ్లు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచింది. అయితే, ఐదేళ్లుగా ఇక్కడ అభివృద్ధికి కాంగ్రెస్‌ అడ్డుపడుతూ.. ఉగ్రవాదం, వేర్పాటువాదం, నక్సలిజం, అవినీతి,  బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. దేశానికి కాంగ్రెస్‌ పెద్ద సమస్య. సుపరిపాలన, అభివృద్ధి, శాంతి భద్రతలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మాత్రమే చూడగలం. ఛత్తీస్‌గఢ్‌తో ఉత్తరప్రదేశ్‌ ప్రజలకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పవిత్ర భూమిపై ప్రజలకున్న విశ్వాసాలతో కాంగ్రెస్‌ ఆడుకోవడం దుర్మార్గం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీ: వాయు కాలుష్యం ఎఫెక్ట్‌.. స్కూల్స్‌ బంద్‌

మరిన్ని వార్తలు