ఎన్నికల బరిలో డజను మంది డాక్టర్‌ బాబులు! 

25 Oct, 2023 03:14 IST|Sakshi

కోరుట్ల ఓపెనర్‌ అరవింద్, హూజూరాబాద్‌ బౌలర్‌ పాడి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బరిలో అభ్యర్థుల అర్హతలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ ఎన్నికల బరిలో ఉమ్మడి కరీంనగర్‌ నుంచి అసెంబ్లీకి పోటీ పడుతున్న అభ్యర్థుల నేపథ్యం ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ బరిలో దిగబోయేవారిలో డజనుమంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో ఎనిమిది మంది ఎంఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి వైద్యశాస్త్రం చదివిన విద్యావంతులు ఉన్నారు. అదే సమయంలో కొందరు పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ పొందిన అభ్యర్థులూ ఉన్నారు. ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచేవారిలో ఉమ్మడి కరీంనగర్‌లోని పలు అసెంబ్లీ స్థానాల నుంచి 12 మంది పేర్లలో తొలుత డాక్టర్‌ ఉండటం గమనార్హం. అదే సమయంలో ఇద్దరు రంజీ ప్లేయర్లు కూడా అసెంబ్లీ బరిలో నిలవడం విశేషం. 

ఎనిమిది మంది వైద్యులు 
డాక్టర్‌ సంజయ్‌ ఎంఎస్, ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌–జగిత్యాల) 
డాక్టర్‌ సంజయ్‌ ఎంఎస్, (బీఆర్‌ఎస్‌– కోరుట్ల)  
డాక్టర్‌ భోగశ్రావణి బీడీఎస్‌ (బీజేపీ–జగిత్యాల) 
డాక్టర్‌ వికాస్‌బాబు ఎంబీబీఎస్‌ (బీజేపీ– వేములవాడ) 
డాక్టర్‌ కే.సత్యనారాయణ ఎంఎస్‌ (కాంగ్రెస్‌–మానకొండూరు) 
డాక్టర్‌ బల్మూరి వెంకట్‌ ఎంబీబీఎస్‌ (కాంగ్రెస్‌–హుజూరాబాద్‌)  
డాక్టర్‌ జేఎన్‌ వెంకట్‌ ఎంబీబీఎస్‌ (బీజేపీ – కోరుట్ల) 
డాక్టర్‌ నగేశ్‌ ఎంబీబీఎస్‌ (వైఎస్సార్‌ టీపీ– కరీంనగర్‌) 

నలుగురు డాక్టరేట్‌లు 
డాక్టర్‌ రసమయిబాలకిషన్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే (మానకొండూరు)  
డాక్టర్‌ కొనగాల మహేశ్‌ (కాంగ్రెస్‌–కరీంనగర్‌) 
డాక్టర్‌ మేడిపల్లి సత్యం (కాంగ్రెస్‌–చొప్పదండి) 
డాక్టర్‌ గోలి మోహన్‌ (సైంటిస్ట్‌) (బీఎస్పీ–వేములవాడ) 

ఇద్దరు క్రికెటర్లు.. 
సెకండ్‌ ఇన్నింగ్స్‌ విజయంపై.. 
కోరుట్ల నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ రంజీ క్రికెటర్‌. 1995లో హైదరాబాద్‌ జట్టుకు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడారు. గత ఎన్నికల్లో తాను ఓపెనింగ్‌ చేసిన తొలి ఎన్నికల్లో అప్పటి నిజామాబాద్‌ ఎంపీ కవితను ఓడించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ సంచలన విజయంపై అర్వింద్‌ కన్నేశారు. 

బెస్ట్‌ ఫెర్ఫామెన్స్‌ కోసం..  
ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి...2018లో ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా అదే ప్రత్యర్థిపై బరిలో నిలిచారు. రాజకీయాల్లోకి రాకముందు పాడి కౌశిక్‌రెడ్డి సైతం రంజీ ఆటగాడు. 2004 నుంచి 2007 వరకు హైదరాబాద్‌ జట్టులో ఫాస్ట్‌»ౌలర్‌గా కొనసాగారు. వీణవంక ఎక్స్‌ప్రెస్‌గా పేరున్న కౌశిక్‌రెడ్డి తన కెరీర్‌లో 47 వికెట్లు తీసి, ఒక అర్థసెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన రికార్డు కూడా కౌశిక్‌ పేరిట ఉండటం విశేషం.  

మరిన్ని వార్తలు