గుర్తుంచుకునేలా..

12 Nov, 2023 03:15 IST|Sakshi

193 రకాల వస్తువులను గుర్తులుగా కేటాయిస్తున్న ఎన్నికల సంఘం  

సాక్షి మంచిర్యాల డెస్‌్క: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తు ప్రధానమైనది. రిజిష్టర్డ్‌ పార్టీలకు ఎన్నికల సంఘం కామన్‌ సింబల్‌ను కేటాయిస్తుంది. ఇక స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉంటే ఈసీ సూచించిన గుర్తుల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఎయిర్‌ కండిషనర్, అల్మారా, ఆపిల్, ఆటోరిక్షా, బేబీవాకర్, బెలూన్, బ్యాంగిల్స్, బ్యాట్, బ్యాట్స్‌మెన్, బ్యాటరీ టార్చ్, బెల్ట్, బెంచ్, బ్రష్, బకెట్, కేక్, కెమెరా, డీజిల్‌ పంప్, ఫుట్‌బాల్, గ్యాస్‌ స్టౌవ్, గిఫ్ట్‌ప్యాక్, గ్రామఫోన్, హార్మోనియమ్, హాకీ అండ్‌ బాల్, లేడీ ఫింగర్, లాప్‌టాప్, లెటర్‌ బాక్స్, లూడో, మిక్సీ, నెయిల్‌కట్టర్, పెన్‌డ్రైవ్, కుండ, టెలిఫోన్, టెలివిజన్, టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్‌.. ఇలా ఏ అక్షర క్రమం నుంచి డబ్ల్యూ వరకు 193 రకాల వస్తువులను ఎన్నికల సంఘం గుర్తులుగా సూచించింది.

స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో ఈసీ కొన్ని విధానాలు అవలంభిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో సూచించాల్సి ఉంటుంది. ఈ గుర్తులను మిగతా ఎవరూ ఎంపిక చేసుకోకుంటే వాటిలో ఒకటి కేటాయిస్తుంది. ఒకే గుర్తును ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటే రిటర్నింగ్‌ అధికారి లాటరీ ద్వారా ఒకరికి కేటాయిస్తారు. 

జనసేనకు 32 స్థానాల్లో కామన్‌ సింబల్‌ 
జనసేన పార్టీ విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం తెలంగాణలోని 32 అసెంబ్లీ స్థానాల్లో కామన్‌ సింబల్‌ను కేటాయిస్తూ ఈ ఏడాది సెపె్టంబర్‌ 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. కానీ, పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన ఎనిమిది స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తోంది.

ఈ స్థానాల్లో ఏడు చోట్ల మాత్రమే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఉంటుంది. జనసేన పార్టీ కోరిన 32 స్థానాల్లో తాండూర్‌ అసెంబ్లీ స్థానం లేకపోవడంతో ఎన్నికల సంఘం జాబితాలో లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి మరో గుర్తు ఎంచుకోవాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు