మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలి.. ఎంపీ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్‌ కమిటీ సిఫార్సు

8 Nov, 2023 21:41 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగేందుకు అర్హత లేదని, ఆమెను సభ నుంచి బహిష్కరించాలని పార్లమెంటరీ ఎథిక్స్‌ ప్యానెల్‌ తేల్చి చెప్పింది. ఆమెపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ఆమెను లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బుధవారం సిఫార్సు చేసింది. 

మహువాపై వచ్చిన నగదు సంబంధిత ఆరోపణలపై ఎథిక్స్‌ ప్యానెల్‌ పరిశీలన జరిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. మొత్తం 500 పేజీలతో కూడిన నివేదికను ప్యానెల్‌ సిద్ధం చేసింది. ఆమె నివేదిక ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్‌ సిఫారసు చేసింది. అంతేకాదు.. ఈ మొత్తం వ్యవహారంలో ఆమెపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్న ప్యానెల్‌..  కేంద్రం ఆధ్వర్యంలో కాలపరిమితితో కూడిన చట్టపరమైన దర్యాప్తునకు సిఫార్సు చేసింది. 

రాజకీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాకు డబ్బులు చెల్లించినట్లు ఓ వ్యాపారవేత్త చేసిన ఆరోపణలతో పెను దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారం అంతా ప్రధాని కార్యాలయం నుంచే నడుస్తోందని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెపై నమోదు అయిన ఫిర్యాదుల ఆధారంగా.. పార్లమెంటరీ ఎథిక్స్‌ ప్యానెల్‌ విచారణ చేపట్టింది. నవంబర్‌ 2వ తేదీన ఎథిక్స్‌ కమిటీ ముందు ఆమె హాజరయ్యారు కూడా. అయితే విచారణ మధ్యలోనే ఆమె వెళ్లిపోవడం, ఆ సమయంలో ఎథిక్స్‌ కమిటీపై ఆమె చేసిన ఆరోపణలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు