ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలి

10 Nov, 2023 05:15 IST|Sakshi

డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ సిఫారసు

న్యూఢిల్లీ: టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటువేయాలని లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సిఫారసు చేసింది. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రశ్నలడిగేందుకు వ్యాపార వేత్త హీరా నందానీ నుంచి డబ్బులు తీసుకు న్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చిన విష యం తెలిసిందే. ఈ అంశాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఎథిక్స్‌ కమిటీకి పంపారు. బీజేపీ ఎంపీ వినోద్‌కుమార్‌ సోంకార్‌ సారథ్యంలో గురువారం సమావేశమైన 10 మంది సభ్యుల ఎథిక్స్‌ కమిటీ 479 పేజీల నివేదిను ఆమోదించింది.

పదిహేను రోజుల వ్యవధిలో ముగ్గురిని ప్రశ్నించి దీనిని తయారు చేశామని సోంకార్‌ చెప్పారు. ఎంపీ మొయిత్రాను సస్పెండ్‌ చేయా లన్న సిఫారసును కమిటీలోని నలుగురు వ్యతిరేకించగా ఆరుగురు బలపరిచారని తెలిపా రు. కాగా, ఒక ఎంపీపై అనర్హత వేటు వేయాలంటూ ఎథిక్స్‌ కమిటీ సిఫారసు చేయడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దీనిపై ఎంపీ మొయిత్రా స్పందిస్తూ.. ఇదంతా ముందుగానే ఖరారు చేసిన ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పటికి తనను బహిష్కరించినా, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ సభలోకి అడుగుపెడతానన్నారు. ఈ నివేదికను ఎథిక్స్‌ కమిటీ పార్లమెంట్‌ ముందుంచుతుంది. అనంతరం చర్చ, ఆపైన చర్యలపై ఓటింగ్‌కు పెడతారు. ఎంపీ మహువా మొయిత్రా లంచం తీసుకున్నారంటూ అక్టోబర్‌ 14న బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే, లాయర్‌ జై అనంత్‌ దేహద్‌రా య్‌తో కలిసి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఇలా ఉండగా, తమ ఎంపీ మొయిత్రాను టీఎంసీ గట్టి గా సమర్థించింది. బీజేపీ సారథ్యంలోని కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రశ్నించిన వారిని వేధిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ విమర్శించారు. ఆరోపణలు రుజువు కాకు ండానే పార్లమెంటరీ కమిటీ ఆమెపై చర్యలకు ఎలా సిఫారసు చేస్తుందని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు