బీజేపీ కుయుక్తులు.. టీడీపీ కుట్రలు

31 Oct, 2021 02:47 IST|Sakshi

బద్వేలులో వైఎస్సార్‌సీపీ మెజార్టీ తగ్గించేందుకు ఎత్తుగడ 

ఓటర్లను పోలింగ్‌ బూత్‌ల వరకు రాకుండా అడ్డుకునే వ్యూహం 

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట ధ్వజం

సాక్షి, కడప: వైఎస్సార్‌ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నాయకులు కుయుక్తులుతో ఓటర్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఉప ఎన్నికలో పోటీకి దూరమని ప్రకటించిన టీడీపీ కుట్రలతో ముందుకెళ్లిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం రాత్రి కడపలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీపై విమర్శలకు దిగుతోందని దుయ్యబట్టారు. గెలవలేమని తెలిసినా వైఎస్సార్‌సీపీకి మెజార్టీ తగ్గించాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు ఎక్కడికక్కడ బూత్‌ల వద్ద కుయుక్తులకు తెర లేపారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

ఐడీ కార్డులు, ఇతరత్రా కారణాలు చెబుతూ బూత్‌ల వద్దకు ఓటర్లు రాకుండా అడ్డుకునే కుట్ర చేయడం దారుణమన్నారు. బీజేపీ నాయకులు కోరిన విధంగానే 281 బూత్‌లలోనూ వెబ్‌ కాస్టింగ్‌తోపాటు లైవ్‌ కవరేజ్‌ చేశారన్నారు. అయినప్పటికీ ఓట్లు రావన్న కారణంతో బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఏదో ఒక అరాచకం చేసి ఓటర్లను రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ అభ్యర్థి పోటీ చేయకపోయినా అన్ని బూత్‌లలో బీజేపీ తరఫున టీడీపీ కార్యకర్తలే ఏజెంట్లుగా కూర్చోవడం చూస్తే కుట్ర రాజకీయాలు ఏమేరకు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. 

ఏం చూసి బీజేపీకి ఓట్లేస్తారు
బీజేపీకి ఏం చూసి ప్రజలు ఓట్లేస్తారని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో  ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. బద్వేలులో అవాంఛనీయ ఘటనలు ఏమీ జరగకపోయినా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఏదో జరిగినట్టు మాట్లాడటం తగదన్నారు. వారికి బలం లేనిచోట ఏజెంట్లను పెట్టుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించిన ఘటన ఒక్కటైనా చూపించాలన్నారు. 

మరిన్ని వార్తలు