ఇది యూపీ కాదు.. మీ ఆటలు ఇక్కడ సాగవు

28 Aug, 2023 21:01 IST|Sakshi

కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ యూత్ వింగ్ నిర్వహించిన ర్యాలీ సందర్బంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే నిరంకుశత్వం రాజ్యమేలుతుందని ఈ ఏడాది చివర్లోగాని వచ్చే ఏడాది ప్రారంభంలో గాని లోక్‌సభ ఎన్నికలు ఉంటాయని అధికార బీజేపీని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రత్యర్ధులు గెలుపుకోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తారని.. ఇటీవల పర్‌గణాస్ జిల్లా 24 నార్త్‌లో బాణాసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదం లాంటి దురాగతాలకు పాల్పడటానికి కూడా వెనకడుగు వేయరని. అలాంటివారికి వారికి కొంతమంది పోలీసులు కూడా సహకరిస్తుండటం సరికాదన్నారు. చాల మంది పోలీసులు తమ పనిని తాము చిత్తశుద్ధితో చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రమే దుష్టశక్తులతో చేతులు కలిపారని ఆరోపించారు. ర్యాగింగ్ నిరోధక విభాగం ఉన్నట్లే అవినీతి నిరోధక విభాగం కూడా ఉందని వారికి గుర్తు చేస్తున్నానన్నారు. కాషాయం బాణాసంచాతో ఏమి ప్రయోజనం ఉంటుంది? పచ్చ బాణాసంచాతో అయితే వాతావరణానికి కూడా మేలు కలుగుతుంది కదా అన్నారు.  

ఇప్పటికే కాషాయ పార్టీ ఎన్నికల కోసం తన అమ్ములపొదిలో అస్త్రాలన్నిటినీ సిద్ధం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే వారు దేశమంతటా మత విద్వేషాలు రెచ్చగొట్టారు. మళ్ళీ వారు అధికారంలోకి వస్తే దేశాన్ని ద్వేషపూరితంగా మార్చేస్తారు. బీజేపీ ఇతర పార్టీల వారికి అవకాశం లేకుండా ఎన్నికల కోసం మొత్తం హెలికాఫ్టర్లన్నిటినీ బుక్ చేసేశారన్నారు.   

ఇదే క్రమంలో ఆమె బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ని కూడా లక్ష్యం చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వొద్దు. పశ్చిమ బెంగాల్‌లో మూడు దశాబ్దాలు రాజ్యమేలిన కమ్యూనిస్టుల కంచుకోటకు బీటలు వారేలా చేసిన ఘనత నాదని పరోక్షంగా గవర్నర్‌ని ఉద్దేశించి అన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో 'గోలీ మారో' అంటూ నినాదాలు చేస్తున్న ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను కటకటాలోకి నెట్టామని, మళ్ళీ లాంటి నినాదాలు చేసేవారంతా ఇది యూపీ కాదు బెంగాల్ అని గుర్తుంచుకోవాలన్నారు.   

ఇది కూడా చదవండి: ఆ లెక్చరర్‌ని ఎందుకు సస్పెండ్ చేశారు.. సుప్రీంకోర్టు  

మరిన్ని వార్తలు