కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీష్‌ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

6 Nov, 2022 16:49 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస​్‌ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆనందం వ్యక్తపరుస్తున్నాయి. ఇక, ఉప ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా మంత్రి జగదీష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు కేసీఆర్‌తోనే ఉన్నారని మరోసారి రుజువైంది. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఛాలెంజ్‌పై మీడియా ప్రశ్నించగా.. మంత్రి జగదీష్‌ రెడ్డి..ఈ జిల్లాలో వాళ్ల అన్నదమ్ముల మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మరు. అలాంటి ఛాలెంజ్‌లు చాలా చేసే ఉంటారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ మాటను వారు అమలు చేయలేదు. వాళ్లు గురించి నేను పెద్దగా పట్టించుకోను. 

టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు, కీలక నేతలు వచ్చారు. కానీ, వారు కేసీఆర్‌ను ఓడించలేకపోయారు. బీజేపీ నేతలు ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతి చేసినా.. ప్రజలు కేసీఆర్‌ వెంటే ఉన్నారు. కేసీఆర్‌గారు మీరు ఢిల్లీ వెళ్లండి.. దేశరాజకీయాల్లోకి వెళ్లండి అని ప్రజలు చెప్పకనే చెప్పారు. ఇక, ఇక్కడి నుంచే కేసీఆర్‌గారు ఢిల్లీపైన ధర్మయుద్ధం ప్రారంభిస్తారు. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. 

మరోవైపు.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మునుగోడులో ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ డిపాజిట్‌ కోల్పోవడంపై కూడా మంత్రి జగదీష్‌ రెడ్డి స్పందించారు. అది కాంగ్రెస్‌ పార్టీ స్వయంకృతపారాధం. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేదు అనడానికి ఇదే నిదర్శనం. నల్లగొండలో కాంగ్రెస్‌కు ఇక గత చర్రితే అని అన్నారు. 

మరిన్ని వార్తలు