‘ప్రజలు ఛీ కొట్టినా నారా లోకేష్‌కు బుద్ది రాలేదు’

7 Nov, 2023 17:11 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు ఉందా? అని ఏపీ మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. దొంగచాటుగా మంత్రి అయిన లోకేష్‌.. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదని, ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా లోకేష్‌కు బద్ది రాలేదని జోగి రమేష్‌ దుయ్యబట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు.  

నారా లోకేష్‌కు ఈడీ, ఐటీ ఎవరి పరిధిలో ఉన్నాయో తెలియదా? అని జోగి రమేష్‌ నిలదీశారు. కక్షసాధింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నరని, చంద్రబాబు పాపం పండింది కాబట్టే దొరికిపోయారని అన్నారు. ‘సీఎం జగన్‌ హీరో.. లోకేష్‌ జీరో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని సీఎం జగన్‌ హీరో అయ్యారు. చంద్రబాబు తప్పు చేయలేదని లోకేష్‌ ఎందుకు చెప్పలేకపోతున్నారు? 3,300 కోట్ల దోచుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు ఆధారాలతో సహా స్కిల్‌ స్కామ్‌ కేసులో బాబు దొరికిపోయారు కనుకే జైలుకు వెళ్లాడు. స్కాం బయట పడ్డాక రిమాండ్‌కు వెళ్లారు. రాజ్ భవన్ బయట లోకేష్ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. చంద్రబాబుని అరెస్టు చేశారనీ, జైలుకు పంపారని ఏడుపు మొదలెట్టాడు.

అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు. మా ఎంపీలు, ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? గవర్నర్‌కు ప్రజాస్వామ్యం, చట్టం గురించి తెలియదని లోకేష్ అనుకుంటున్నారు. సిద్దార్దలూత్ర లాంటి గంటకు కోటన్నర తీసుకునే లాయర్లతో వాదించినా ఎందుకు బెయిల్ రాలేదు?. కన్ను బాగలేదు, కాలు బాగులేదని చెప్పుకుని బయటకు వచ్చారు. చంద్రబాబుకు మెడికల్ గ్రౌండ్స్‌లేనే తప్ప సాధారణ బెయిల్ ఎందుకు రాలేదో తెలుసుకో లోకేష్. 

మమ్మల్ని తొక్కితాడంట. ఆల్రెడీ మేము తొక్కేసి, తాట తీశాం అన్న సంగతి తెలుసుకో. ఇదే స్కిల్ స్కాంలో ఈడీ అధికారులు నలుగురిని అరెస్టు చేశారని ఎందుకు చెప్పలేదు?. సీఐడీ మా పరిధిలో ఉందన్నావు సరే మరి ఈడీ, ఐటీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వలేదా? టీడీపీకి కాదు, తన జాతికి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు. అధికారం ఉంటే మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాదా?. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని వ్యూహాలు వేసినా టీడీపీ అడ్రస్ గల్లంతే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ ఒక తాటి మీదకు వచ్చి జగనే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇది గుర్తు పెట్టుకుని లోకేష్ పిచ్చిప్రేలాపనలు మానుకోవాలి’ అని జోగి రమేష్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు