అందులో తప్పేముంది? మేం రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాం: కాంగ్రెస్‌ ఎంపీ

10 Nov, 2023 15:40 IST|Sakshi

భారత్‌ శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Infosys Narayana Murthy) చేసిన వ్యాఖ్యపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కొంతమంది ఆయన్ను సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. 

దేశ ఉత్పాదకత పెరగడానికి ఎక్కువ గంటలు పనిచేయాలన్న  నారాయణమూర్తి సలహాను సమర్థిస్తున్నవారి జాబితాలోకి తాజాగా కాంగ్రెస్‌ ప్రముఖ నేత, ఎంపీ మనీష్‌ తివారి (Manish Tewari) చేరారు. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలో తప్పేముందని ప్రశ్నించారు. దీనిపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ మేరకు ‘ఎక్స​్‌’(ట్విటర్‌)లో ఆయన పోస్ట్‌ చేశారు. 

అది తప్పనిసరి నియమం కావాలి
‘వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు.. అందులో తప్పేముంది? ఓ వైపు ప్రజా జీవితం, మరో వైపు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూనే మా లాంటి ప్రజా ప్రతినిధులు రోజుకు 12-15 గంటలు పనిచేస్తున్నాం.

నేను చివరగా ఎప్పుడు ఆదివారం సెలవు తీసుకున్నానో నాకు గుర్తే లేదు. గెలిచినా, ఓడిపోయిన ప్రజా జీవితంలో ఉన్నవారికి ఆదివారం సెలవు అనేది ఉండదు. వారానికి 70 గంటలు పని, ఒక రోజు సెలవు, సంవత్సరానికి 15 రోజులు విరామం అనేది తప్పనిసరి నియమం కావాలి’ అని మనీష్‌ తివారి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని వార్తలు