రఘురామకృష్ణరాజు తీరుపై మండిపడ్డ క్షత్రియ నేతలు

16 May, 2021 13:49 IST|Sakshi

భీమవరంలో క్షత్రియ సమాఖ్య ముఖ్యనేతల భేటీ

వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి విమర్శలు చేయడం సరికాదు

పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సపోర్ట్‌ చేయం

ఎంపీ రఘురామకృష్ణరాజుపై క్షత్రియ నాయకుల ధ్వజం

సాక్షి, పశ్చిమ గోదావరి: ఎంపీ రఘురామకృష్ణరాజు తీరును క్షత్రియ నాయకులు తప్పుపట్టారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆదివారం భీమవరంలో క్షత్రియ సమాఖ్య ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో భీమవరం, పాలకొల్లు, గణపవరం, తణుకు, తాడేపల్లి గూడెం క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్షత్రియ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, క్షత్రియులపై గౌరవంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో‌ 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఇచ్చి గౌరవించారన్నారు. రఘురామకృష్ణరాజుకు క్షత్రియ సేవాసమితి ఎలాంటి మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వానికి, రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. ఇందులో క్షత్రియ కులాన్ని కలపొద్దని.. తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

రఘురామకృష్ణరాజుకు స్థానిక ఎమ్మెల్యేలతో సఖ్యత లేదని.. స్వలాభం, ఆస్తులు కాపాడుకోవడానికే ఆయన మాట్లాడుతున్నారని క్షత్రియ నాయకులు దుయ్యబట్టారు. రఘురామ మాట్లాడే విధానం, పద్ధతి అపహస్యంగా ఉందని మండిపడ్డారు. ‘‘గడిచిన 14 నెలలుగా ఒక్కసారి కూడా సొంత నియోజకవర్గానికి రాలేదు. హైదరాబాద్‌, ఢిల్లీలో మకాం పెట్టి రోజుకో కులాన్ని దూషిస్తున్నాడు. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసే ఎవ్వరికీ సపోర్ట్‌ చేయమని’’ క్షత్రియ నాయకులు స్పష్టం చేశారు.

చదవండి:
ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు

ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు?

మరిన్ని వార్తలు