సాక్షి, హైదరాబాద్: ‘అన్ని రాష్ట్రాలవారు ఇంగ్లిష్ కాదు, హిందీ మాత్రమే మాట్లాడాలి‘ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘అమిత్ షా గారూ.. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. వసుధైక కుటుంబానికి అసలైన నిర్వచనం. ఏం తినాలో, ఏది ధరించాలో, ఎవరిని పూజించాలో, ఏ భాషలో మాట్లాడాలనే అంశాల్లో దేశ ప్రజలకు మనం స్వేచ్ఛ ఎందుకు ఇవ్వకూడదు‘ అని ప్రశ్నించారు.
భాషోన్మాదం, ఆధిపత్య ధోరణి ఎదురుతన్నడం ఖాయమని హెచ్చరించారు. ‘మొత్తానికి ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ నంబర్ వన్ స్థానానికి చేరింది. డాలర్ విలువ, కొనుగోలు శక్తి తదితరాలతో పోల్చి చూస్తే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో మూడు, ఎనిమిదో స్థానంలో ఉంది‘ అని కేటీఆర్ మరో ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.