అందరం ఒక్కటవుదాం

22 Nov, 2023 04:25 IST|Sakshi
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్‌

ఢిల్లీ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకుందాం 

దుబ్బాక, సిరిసిల్ల రోడ్‌షోల్లో మంత్రి కేటీఆర్‌ 

కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ఢిల్లీదే పెత్తనం 

తెలంగాణపై కేసీఆర్‌కున్న ప్రేమ వాళ్లకు ఉండదు 

దుబ్బాక టౌన్‌/సిరిసిల్ల: ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టవద్దని, కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే ఢిల్లీయే పెత్తనం చెలాయిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ చెప్పారు.కాంగ్రెస్‌కు 11 సార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని చావగొట్టిందని, ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులొస్తాయని 50 ఏళ్లు వెనక్కిపోతామని అన్నారు. అందరం ఒక్కటై ఢిల్లీ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ, కాంగ్రెస్‌లకు పొరపాటున కూడా ఓటు వేయవద్దని కోరారు. తెలంగాణపై సీఎం కేసీఆర్‌కున్న ప్రేమ ఢిల్లీ రాహుల్‌ గాంధీకి, మోదీకి ఉండదని స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్డు షోల్లో ఆయన ప్రసంగించారు.

మీకెందుకు చాన్స్‌ ఇయ్యాలి? 
‘కాంగ్రెసోళ్లు ఒక్క చాన్స్‌ ఇవ్వమని అడుగుతున్నారు. 55 ఏళ్లలో 11 సార్లు అవకాశం ఇస్తే ఏం వెలగబెట్టారు? ఇప్పుడు మళ్లీ చాన్స్‌ ఇచ్చి ఎరువుల కోసం దుకాణాల ముందు క్యూలో నిలబడాలా? కరెంటు కోసం అర్ధరాత్రి మళ్లీ పొలాల కాడ పడుకోవాలా? అలాంటి కాంగ్రెస్‌ దరిద్రపు పాలన మనకు మళ్లీ కావాలా? ధరణిని తొలగించి మళ్లీ పట్వారీ విధానం అమలు చేస్తామంటున్నారు.

రాహుల్, రేవంత్‌లకు ఎవసం, ఎద్దు తెల్వదు.. ఉత్తమ్‌ రైతుబంధు దుబారా అంటడు.. భట్టి ధరణి వద్దు అంటాడు..ధరణి కావాలా? దళారులు కావాలా? ఎట్లున్న తెలంగాణ ఎట్ల అయ్యింది? రైతులకు కడుపు నిండా 24 గంటల కరెంట్, సాగునీరు, ఇంటింటికీ తాగునీరు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మీ సాయం ఇలా ఎన్నో మంచి పనులు కేసీఆర్‌ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వస్తే.. ఇప్పుడు 46 లక్షల మందికి వస్తున్నాయి. ఈ పనులన్నీ కాంగ్రెసోళ్లకు కనపడ్తలేవా..? మళ్లీ మీకెందుకు చాన్స్‌ ఇయ్యాలి?..’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

కత్తిపోటు రాజకీయానికి ఓటుతో బుద్ధి చెప్పాలి 
‘పార్టీ దుబ్బాక అభ్యర్థి ప్రభాకరన్నను ఎన్నికల్లో ఎదుర్కోలేక కత్తితో పొడిచిండ్రు. కత్తిపోటు రాజకీయాలను ఓటుతో ఎదుర్కోవాలి. రఘునందన్‌రావును చిత్తుగా ఓడించి ప్రభాకరన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి..’ అని కేటీఆర్‌ కోరారు. దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. 

అధికారంలోకి రాగానే కొత్త రేషన్‌ కార్డులు 
‘డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు రాగానే, సీఎంగా కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే జనవరిలో కొత్త రేషన్‌ కార్డులు, ఆసరా పెన్షన్లు అర్హులకు అందిస్తాం. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని సవరించి మరింత మందికి పెన్షన్‌ అందిస్తాం. కోడళ్లకు సౌభాగ్య లక్ష్మీ పేరిట పెన్షన్లు ఇస్తాం. తెల్ల రేషన్‌కార్డులపై సన్నబియ్యం అందిస్తాం.

రైతుబంధు ను ఎకరానికి ఏటా రూ.16 వేలు చొప్పున ఇస్తాం..’ అని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ‘తొమ్మిదిన్నరేళ్లలో ఎ న్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమ లు చేశాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. కర్ణాటక నుంచి కాంగ్రెస్‌కు.. గుజరాత్‌ నుంచి బీజే పీకి పైసలు వస్తున్నాయి. అంగట్లో పశువులను కొ న్నట్లు కొంటున్నారు. మోదీ, అమిత్‌ షా, రాహుల్, సిద్ధరామయ్య, షేర్‌లు, బబ్బర్‌ఖాన్‌లు ఎంతమంది వచి్చనా సరే సింహం సింగిల్‌గా వచ్చినట్లు కేసీ ఆర్‌ దూసుకుపోతున్నారు..’ అని పేర్కొన్నారు.

కారు ఉండగా బేకార్‌గాళ్లెందుకు 
రాంగోపాల్‌పేట్‌/కంటోన్మెంట్‌ (హైదరాబాద్‌): బక్క పలుచని కేసీఆర్‌ను ఓడించి తెలంగాణ గొంతు పిసికేందుకు ఢిల్లీ నుంచి షేర్‌లు, శంషేర్‌లు వస్తున్నారని, కారు ఉండగా ఇలాంటి బేకార్‌గాళ్లు మనకెందుకని కేటీఆర్‌ అన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని మహంకాళి దేవాలయం వద్ద, కంటోన్మెంట్‌ నియోజకవర్గంలోని అన్నానగర్, పికెట్‌ చౌరస్తాల్లో నిర్వహించిన రోడ్డు షోల్లో ఆయన ప్రసంగించారు.  

కంటోన్మెంట్‌ సమస్యలకు విలీనమే పరిష్కారం: ‘కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న కంటోన్మెంట్‌ అభివృద్ధిలో వెనుకబడిన మాట వాస్తవమే. జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తేనే కంటోన్మెంట్‌ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది..’ అని మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇటీవల సంచలనంగా మారిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందిత, డబుల్‌ బెడ్‌రూమ్‌ బాధితుడి సంభాషణల వీడియోలపై ఆయన స్పందించారు. బీజేపీ వాళ్లు చిల్లర వీడియోలతో బదనాం చేస్తున్నారని, సాటి ఆడకూతురుని అవమానించిన బీజేపీని బొందపెట్టాలని మహిళలను ఆయన కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కంటోన్మెంట్‌ అభ్యర్థి లాస్య నందిత తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు