చంద్రబాబు వల్లే ఎన్టీఆర్‌ మరణించారు

10 Oct, 2020 03:34 IST|Sakshi
ఎన్టీఆర్‌ విగ్రహం ఆవిష్కరిస్తున్న లక్ష్మీపార్వతి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి

తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి 

కావలి: తెలుగు ప్రజల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడి దుర్మార్గమైన కుట్రల వల్లే మరణించారని ఎన్టీఆర్‌ సతీమణి, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు గ్రామంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాన్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అధికార దాహంతో చంద్రబాబు కుట్రలో భాగస్వాములైన టీడీపీ నేతలందరూ ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన వారేనన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓట్ల కోసం ఎన్టీఆర్‌ పేరు వాడుకుంటారని, అనంతరం ఏ సందర్భంలో కూడా ఎన్టీఆర్‌ ప్రస్తావన తీసుకురాని దుష్టుడని మండిపడ్డారు. తాను చంద్రబాబు నాయుడుపై 20 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా ఫలితం దక్కిందని చెప్పారు. అందరి సంక్షేమాన్ని కోరుకుంటూ పలు పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మరో 30 ఏళ్లు సీఎంగా కొనసాగుతారని లక్ష్మీపార్వతి చెప్పారు. 

మరిన్ని వార్తలు