‘ఆ ఎన్నికలు అయిపోగానే ఇంధన ధరలు పెంచుతారు’

4 Nov, 2021 18:18 IST|Sakshi

ఇంధన ధరల తగ్గింపు ఓ డ్రామా

కేంద్రంపై మండిపడ్డ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌

లక్నో: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించి.. ప్రజలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కేం‍ద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఉప ఎన్నికలో​ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీజేపీ.. రానున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందని ఆరోపిస్తున్నాయి. 

ఈ క్రమంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుపై స్పందించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తిరిగి ఇంధన ధరలు పెంచుతారని తెలిపారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుంది. దాన్ని నివారించడం కోసమే ఎన్‌డీఏ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది’’ అని తెలిపారు.
(చదవండి: పెట్రో పరుగుకు బ్రేకులు...! వాహనదారులకు కేంద్రం శుభవార్త..!)

‘‘తగ్గించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎంతో కాలం ఉండవు. 2022లో యూపీ ఎన్నికలు అయిపోగానే.. మళ్లీ ఇంధన ధరలకు రెక్కలు వస్తాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరు 50 రూపాయలకు తగ్గిస్తే.. అప్పుడు ప్రజలకు నిజమైన ఉపశమనం లభిస్తుంది’’ అన్నారు. ఇక శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కూడా పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌ ధర 50 రూపాయలకు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 

చదవండి: వాహనదారులకు షాకింగ్‌ న్యూస్‌...!

మరిన్ని వార్తలు