ముందు టెట్‌.. ఆ తర్వాత డీఎస్సీ: మంత్రి బొత్స

12 Oct, 2023 17:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: విద్యా శాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్‌ తొలి ప్రాధాన్యత అయిన విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.

‘‘బైజూస్‌ కంటెంట్‌ ఫ్రీగానే ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. అందులోనూ బైజూస్‌ కంటెంట్‌ పెట్టి ఇచ్చాం. దానికి కూడా బైజూస్‌కి ఒక రూపాయి చెల్లించలేదు. అతని వ్యాపారాలతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పిల్లలకు మంచి ఇంగ్లీష్‌ నేర్పడం కోసం టోఫెల్‌ను తీసుకొచ్చాం. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్‌కి ఇచ్చేస్తున్నామని  తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ నిప్పులు చెరిగారు.

టోఫెల్‌లో శిక్షణ కోసం పెట్టే టెస్ట్‌కి ఒక్కో విద్యార్థికి రూ.7.50 పైసలు మాత్రమే ఫీజు. 20 లక్షల 75 వేల మందికి ప్రభుత్వం ఆ ఫీజు కట్టింది. ఆ టెస్ట్‌లో పాస్‌ అయిన వారికి మాత్రమే టెస్ట్‌కి రూ.600 ఫీజు తీసుకుంటారు. మొత్తం కలిపి రూ.6 కోట్లు మాత్రమే టోఫెల్‌ టెస్ట్‌ల కోసం పెడితే రూ.వందల కోట్లు పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేద పిల్లలకు మంచి విద్య అందించడానికి ఖర్చు చేయడం తప్పా?’’ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు.
చదవండి: బాబు లాయర్ల అతి.. బెంచ్‌ దిగి వెళ్లిపోయిన జడ్జి

ముందు టెట్‌.. ఆ తర్వాత డీఎస్సీ..
‘‘డీఎస్సీపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది. డీఎస్సీపై సీఎం దగ్గర చర్చ జరుగుతోంది. ముందు టెట్‌.. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తాం. యూనివర్శిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో 3,200కి పైగా పోస్టులు భర్తీ చేస్తాం. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్‌ వస్తుంది. 18 ఏళ్ల నుండి యూనివర్సిటీల్లో​ పోస్టుల భర్తీ జరగలేదు. పాఠశాలల్లో ఖాళీలన్నింటిని గుర్తించాం’’ అని మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు