మేఘాకు గ్యారెంటీ పచ్చి అబద్ధం: మంత్రి బుగ్గన

23 Nov, 2023 10:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ.. దోపిడీ గురించి మాట్లాడటం గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధమన్నారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదే. ప్రభుత్వానికి సంబంధం లేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు.

‘‘ఆరోగ్యశ్రీపై టీడీపీ వెచ్చించింది రూ.5,177 కోట్లు మాత్రమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514.84 కోట్లు. చంద్రబాబు కళ్లల్లో పడటం కోసం ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అర్థంలేని ఆరోపణలతో విమర్శిస్తున్నారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ. 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపించారు. దోచుకోవడానికే ఇలా చేశారని వితండవాదం చేశారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో మీకు కనీస అవగాహన లేదు’’ అంటూ  మంత్రి బుగ్గన మండిపడ్డారు.

‘‘ఈ విషయం తప్పు కాదనే ఆర్థిక అంశాలలో అవగాహన ఉన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల ఎందుకు మాట్లాడడం లేదు.?. ఏ పనీ చేయకుండా ఏదో చేస్తున్నామనేలా హైప్ చేసి  స్కిల్ డెవలప్‌మెంట్‌లో రూ.241 కోట్లు దోచుకుందెవరు?. రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు?. ఇన్నర్ రింగ్‌రోడ్డును మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు?. సామాన్య ప్రజలలో మా ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారు. అందుకే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లుతున్నారని ప్రజలకు అర్థం అయింది’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: ‘జగనన్న గోరుముద్ద’కు జాతీయ పురస్కారం

మరిన్ని వార్తలు