Delhi Pollution: కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం..

23 Nov, 2023 10:11 IST|Sakshi

దేశరాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్రం ‍ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఇక్కడి జనంలో చికాకు, కోపం, ఒత్తిడి తదితర సమస్యలు పెరుగుతున్నాయి. అత్యంత కలుషిత నగరాల్లో నివసించే జనం డిప్రెషన్, నిద్రలేమి, తలనొప్పి, ప్రవర్తనలో మార్పులు, మానసిక అలసట లాంటి సమస్యలను ఎదుర్కొంటారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాలుష్యం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా  మనిషిలో కోపం, హింసాత్మక ప్రవర్తన పెరుగుతుంది.

విషపూరితమైన గాలిలో ఉండే హానికరమైన పదార్థాలు మనిషి  మెదడుకు చేరి, దానిని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా కాలుష్యపూరిత ప్రాంతాల్లో నివసించేవారు అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం అనేది మెదడును దెబ్బతీస్తుంది. నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్‌ను అడ్డుకుంటుంది. జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతుందని నిరూపితమయ్యింది. 

ఎవరైనా కలుషితమైన గాలిని పీల్చినప్పుడు, శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్రావం పెరుగుతుంది. ఈ హార్మోన్లు మనిషి మెదడును ప్రభావితం చేస్తాయి. దాని సాధారణ పనితీరులో జోక్యం చేసుకుంటాయి. ఫలితంగా అసౌకర్యం, ఆందోళన, ఒత్తిడిని ఎదురవుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయం తీసుకునే శక్తి కూడా తగ్గుతుంది.

రాజధానిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలామంది బయటకు వెళ్లడం లేదు. మునుపటిలా స్నేహితులు, బంధువులను కలవడం తగ్గించేశారు. కనీసం పార్కుకు వెళ్లడం లేదా బయట నడవడం కూడా మానుకున్నారు ఫలితంగా ఒంటరితనం, నిరాశకు గురవుతున్నారు. ఫలితంగా అలాంటి వారిలో చికాకు, కోపం పెరుగుతున్నాయి. 
ఇది కూడా చదవండి: ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి!

మరిన్ని వార్తలు