'పక్కా ప్లాన్‌ ప్రకారమే భూముల్ని కొట్టేశారు'

26 Mar, 2021 18:23 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేతలు అసైన్డ్‌ భూములను పక్కా ప్లాన్‌ ప్రకారం కొట్టేశారని మంగళగిరి  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చంద్రబాబు, ఆయన బినామీలు పేదల భూములను చౌకగా కొట్టేశారని, ల్యాండ్ పూలింగ్ నిబంధనలను మార్చి తమ వారికి లబ్ధి చేకూర్చారన్నారని మండిపడ్డారు. అన్యాయాన్ని కప్పి పుచ్చుకోవడానికి స్టింగ్ ఆపరేషన్‌ అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఏ దళిత సోదరుడైతే చంద్రబాబు మోసం చేశాడని నా దగ్గరకు వచ్చాడో...అతన్ని టీడీపీ మీడియా భయపెట్టి అనుకూలంగా చెప్పించుకుంది. దాన్నో స్టింగ్ ఆపరేషన్ అని చెప్పుకుంటున్నారు . మేమంతా అప్పట్లోనే దళితులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాము. 1920లో బ్రిటిష్ ప్రభుత్వం వారికి డీకే పట్టాలు ఇచ్చారు. ఆ భూములను కూడా పక్కా ప్లాన్‌గా కొట్టేశారు. Pot, poa చట్టాలను అతిక్రమించి చంద్రబాబు ఏమి చేసాడో స్టింగ్ ఆపరేషన్లో తేల్చాల్సింది.

ఇప్పుడు స్టే మీద ఉన్నాడు..మళ్లీ కేసు వచ్చేసరకి ఎదో చేయాలని ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. అసైన్డ్ భూములు అమ్మకూడదు...కొనకూడదు..మరి ఎలా కొట్టేశారు. మీరు నిజంగా ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని ఉంటే దళితులకు పెద్దపీట వేసి వారి భూములు వారికి ఉంచొచ్చు కదా. రాజధానిలో దళిత సోదరుడు ఉండకూడదని నీచంగా వ్యవహరించిన వ్యక్తులు చంద్రబాబు, నారాయణ బహిరంగ చర్చకు రండి. సైనికులకు ఇచ్చిన భూమి 10 ఎళ్ల తర్వాత సైనికుడి సొంతం అవుతుంది. దాన్ని కూడా చట్టాలని ఉల్లంఘించి మరీ కొట్టేశారు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 

3 ఏళ్లలో సింగపూర్ తరహా అద్భుతమైన రాజధాని కడతాను అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పాడని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. 'రాజధాని శంకుస్థాపనకు అగ్రవర్ణాలకు పట్టు వస్త్రాలు పెట్టి పిలిచారు. అదే దళిత ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పెరు కూడా శిలాపలకంపై లేదు. ఇప్పుడు కూడా దళితులను బెదిరిస్తూనే ఉన్నారు ఇవాళ రాజధాని రైతుల దుస్థితికి కారణం ఎవరు..? చంద్రబాబు కాదా..? మూడేళ్ళలో రాజధాని అని దండుకుని పక్కకెళ్లాడు.ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని తండ్రి కొడుకులు ఇటువైపు ముఖం చూపడం లేదు. అన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి...దమ్ముంటే చర్చకి రండి..లేదంటే కేసును ధైర్యంగా ఎదుర్కోవాలి' అని నందిగం సురేష్ డిమాండ్‌ చేశారు. 

చదవండి : బెదిరించి అసైన్డ్‌ భూములను లాక్కున్నారు..
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన కటిఫ్‌?

మరిన్ని వార్తలు