అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మరో వివాదంలో ఇరుకున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజకీయ ప్రసంగం చేశారు. దేవాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే రాజకీయాలు మాట్లాడటంపై గ్రామ యువకులు, బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్టీ గురించి రాజకీయాలు మాట్లాడుతున్నరంటూ గువ్వల బాలరాజును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దేవాలయంలో రాజకీయాలు ఏంటని ప్రశ్నించిన బీజేపీ కార్యకర్తలపై ‘నీ సంగతి చూస్తా బిడ్డ’ అంటూ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. గ్రామస్థులు ఎదురు తిరగబడడంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపు ఆలయ ప్రాంగంలో ఉద్రిక్తత వాతావారణం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు కలుగజేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.