కిషన్ రెడ్డి అలా.. పురంధేశ్వరి ఇలా..

17 Dec, 2023 17:02 IST|Sakshi

పొత్తుల్లో పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ 

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసినన్ని రాజకీయ విన్యాసాలు ఇంకెవరూ చేసినట్లు సమకాలీన రాజకీయాల్లో చేసి ఉండరు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పాలసీ.. ఒక్కో పార్టీతో ఒక్కో మాదిరి పొత్తులు.. ఇక్కడున్న విధానం ఆ రాష్ట్రంలో ఉండదు. అక్కడున్నట్లు ఈ రాష్ట్రంలో ఉండదు.. మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్న ఆయన ఆంధ్రాలో టీడీపీతో కలిసి సాగుతున్నారు. చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఇక ఇదే చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌తో అంటగాకి బీజేపీని దెబ్బతీసేందుకు కృషి చేసింది.

ఇక తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అక్కడ బీజేపీతో కలిసి ఎనిమిది సీట్లలో పోటీ చేసిన పవన్ ఘోరంగా దెబ్బతిన్నారు. అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయి తీవ్ర పరాభవంతో తలదించుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సైతం పవన్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణలో పవన్‌తో పొత్తుకారణంగా తమకు నష్టం వాటిల్లిందని, లేకుంటే తాము ఇప్పుడు గెలిచినా ఎనిమిది సీట్లకు మించి ఇంకో రెండుమూడు సీట్లు ఎక్కువ గెలిచేవాళ్లమని అన్నట్లుగా మెసేజీలు వచ్చాయి. అయితే వాటిని అయన తరువాత ఖండించారు. అయన అలా అన్నారో లేదో తెలియలేదు కానీ.. ఖండన అయితే వచ్చింది.. ఇక ఇటు ఆంధ్రాలో తాము జనసేనతో పొత్తులో ఉన్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు.

ఆంధ్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరించింది అని చెబుతూ.. ఏలూరు మెడికల్ కాలేజీకి రూ.525 కోట్లు ఇచ్చాం. భోగాపురం విమానాశ్రయానికి సైతం నిధులు ఇచ్చామని, ఇంకా పలు జాతీయరహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. అంతేకాకుండా రానున్న సాధారణ ఎన్నికలకు తాము జనసేనతో పొత్తుపెట్టుకుంటామని అన్నారు. అంటే అటు పవన్ మాత్రం తాను టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని అన్నారు. మరి ఆ టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ కూడా ఉంటుందా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు. కానీ పవన్ మాత్రం బీజేపీని టీడీపీని దగ్గర చేర్చాలని చూస్తున్నారు. తెలంగాణాలో వ్యతిరేకంగా పోటీ చేసిన టీడీపీ బీజేపీ.. ఇప్పుడు ఆంధ్రాలో కలిసి ఉంటాయా లేదా చూడాలి.

చదవండి: ఓడినా ఆనందిస్తున్న బండి.. ఎందుకంటే..?

>
మరిన్ని వార్తలు