-

బీఆర్‌ఎస్‌ను దరిదాపుల్లోకి కూడా రానివ్వం.. ఇది బీజేపీ గ్యారంటీ: మోదీ

27 Nov, 2023 13:38 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, బీర్‌ఆఎస్‌ తెలంగాణను నాశనం చేశాయని ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌లో బీజేపీ బహరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. తెలంగాణకు తర్వాతి సీఎం బీజేపీ నుంచి రాబోతున్నారని తెలిపారు. తెలంగాణ తొలి బీజేపీ సీఎం.. బీసీకి చెందిన వ్యక్తి ఉంటారని చెప్పారు. బీజేపీ ‍ప్రభుత్వ మంత్రి వర్గంలో అన్నీ వర్గాలకు స్థానం ఉంటుందన్నారు.

బీజేపీతో ఎలాగైనా దోస్తీ చేయాలని కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చారన్నారు ప్రధాని మోదీ. తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండదలుచుకోలేదని చెప్పారు. ఎన్డీఏలో చేర్చుకోవట్లేదని బీఆర్‌ఎస్‌ నేతలు తనను తిట్టడం మొదలు పెట్టారని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌ను తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వమని.. ఇది మోదీ ఇచ్చే గ్యారంటీనన్నారు. 

తెలంగాణకు ఫాంహౌజ్‌ సీఎం అవసరం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. తెలంగాణను కేసీఆర్‌ మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారని.. మూఢ నమ్మకాలతో సచివాలయాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ చేసిన స్కామ్‌లన్నింటిపైనా దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. స్కామ్‌ చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌లో స్కామ్‌లు చేసిన వారిని జైలుకు పంపిస్తామన్నారు. ల్యాండ్‌, లిక్కర్‌, పేపర్‌ లీక్‌ మాఫియాలను జైలుకు పంపిస్తామని  తెలిపారు. అణగారిన వర్గాలకు సంక్షేమం అందిస్తుంది బీజేపీనేనన్న మోదీ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బీసీ, దళితులను మోసం చేసిందని దుయ్యబట్టారు.
చదవండి: మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు: సచిన్‌ పైలట్‌

మరిన్ని వార్తలు