Punjab Elections: కాంగ్రెస్‌కు పోటీయే లేదు.. పంజాబ్‌ మళ్లీ మాదే

10 Feb, 2022 12:06 IST|Sakshi

మూడింట రెండు వంతుల మెజార్టీ ఖాయం 

సిద్ధూతో కలిసి పనిచేస్తా: సీఎం చన్నీ 

కాంగ్రెస్‌దే గెలుపన్న ఆత్మవిశ్వాసం. కలిసికట్టుగా పనిచేస్తే ఎవరూ పోటీకి రాలేరన్న ధీమా, కేజ్రివాల్‌పై విమర్శలు, భగవంత్‌ మాన్‌పై వ్యక్తిగత దాడి.. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఒక చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఇలా బయటపెట్టారు.

ప్రశ్న : సీఎం అభ్యర్థి కోసం పోటీ పడినపీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి?  
జవాబు: ముఖ్యమంత్రి అభ్యర్థిగా హైకమాండ్‌ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని సిద్ధూ  చెప్పారు. అధిష్టానం నన్ను ఎంపిక చేసింది. ఇక మా మధ్య విభేదాలు ఎందుకుంటాయి? మేము ఈ ఎన్నికల్లో కలిసి పని చేస్తాం. టీమ్‌ వర్క్‌ చేసి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధిస్తాం.  

ప్రశ్న : కాంగ్రెస్‌ గెలిస్తే మీరు మరబొమ్మ సీఎంగా మారిపోతారని మాయావతి అంటున్నారు? దళితులు ఢిల్లీ చేతుల్లో ఉండాలా అన్న ఆమె ప్రశ్నలకు మీ సమాధానం?  
జవాబు: మాయావతి పంజాబ్‌లో కేవలం 20 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ  శిరోమణి అకాలీదళ్‌ పోటీ పడుతోంది. అంటే దళితులు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఈ విషయం ఆమె తెలుసుకోవాలి. నాకు ఈ కులాల రాజకీయాలు తెలీవు. పార్టీలో నాకు మద్దతు ఉందని సీఎం అభ్యర్థిని చేశారు. దళితుడినని చెయ్యలేదు.  

ప్రశ్న : ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రివాల్‌ దూకుడుని అడ్డుకోగలరా ?  
జవాబు: అరవింద్‌ కేజ్రివాల్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు.  మొదట్లో ఆయన ఆబ్‌కీ బార్‌ కేజ్రివాల్‌ పేరిటప్రచారానికి రూ.200–400 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలు దానిని ఆమోదించకపోవడంతో భగవంత్‌ మాన్‌ను తీసుకువచ్చారు. కేజ్రివాల్‌ కన్న కలలు పంజాబ్‌లో నెరవేరవు. ఢిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌తో పాలించే నాయకుల్ని ప్రజలు తిరస్కరిస్తారు.  

ప్రశ్న : భగవంత్‌ మన్‌ మీతో పోటీ పడగలరా ?  
జవాబు: భగవంత్‌ మన్‌ నాకు ఎప్పటికీ పోటీ కాలేరు. పన్నెండో తరగతి పాస్‌ కావడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది. నేను పీజీ చేశాను. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్నాను. ఆయన తాగుడు మానేశానని అంటున్నారు. ఒక్కసారి సాయంత్రం 4 గంటల తర్వాత ఆయనకి ఫోన్‌ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది.

మరిన్ని వార్తలు