సిద్దిపేట నుంచి..మరో టీఆర్‌ఎస్‌ 

20 Oct, 2023 04:44 IST|Sakshi

తెలంగాణ రాజ్య సమితి పేరుతో రిజిస్ట్రేషన్

సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రాజ్య సమితి) పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన సీఎం కేసీఆర్‌ గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఏర్పాటు చేసి, ఇటీవల దానిని బీఆర్‌ఎస్‌ (భారత్‌ రాష్ట్ర సమితి)గా మార్చిన విషయం తెలిసిందే.

తాజాగా అదే సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్‌ మాజీ సభ్యుడు తుపాకుల బాలరంగం పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీని రిజిస్టర్‌ చేసింది. దీనిని టీఆర్‌ఎస్‌ అని సంక్షిప్తంగా పేర్కొంటున్నారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీకి గ్యాస్‌ సిలిండర్‌ గుర్తు కేటాయించింది.

బహుజనులకు రాజ్యాధికారం కోసమే..: రాష్ట్ర జనాభాలో 75 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలున్నా రాజ్యాధికారం దక్కడంలేదు. ముదిరాజ్‌లు 14 శాతం, పద్మశాలీలు 8 శాతం, యాదవ్‌లు 12 శాతం, గౌడలు 10 శాతం జనాభా ఉన్నా, ఐదుశాతం లోపు జనాభా ఉన్నవారికే ప్రస్తుతం పదవులు దక్కుతున్నాయి. రాబోయే కాలంలో బహుజనులకు రాజ్యాధికారం కోసమే పార్టీని స్థాపించాం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50 శాతం సీట్లలో పోటీ చేస్తాం.     – బాలరంగం 

మరిన్ని వార్తలు