తెలంగాణ తీర్పును దేశం గమనిస్తోంది 

29 Nov, 2023 04:58 IST|Sakshi
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్‌షోలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

 కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతుబంధు ఇస్తాం: రేవంత్‌రెడ్డి  

సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్‌ పాములాంటి వాడు. ఓటు వేశారో మిమ్మల్నే కాటు వేస్తాడు. కేసీఆర్‌ను నమ్మడం అంటే పాముకు పాలుపోసి పెంచినట్టే. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపడుతుంది. పదో తేదీన రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తాం’అని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగుల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

కేసీఆర్‌ ఓడినా, గెలిచినా ఫాంహౌస్‌లోనే పడుకుంటాడని, కామారెడ్డి ప్రజల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకే తాను వచ్చానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూంలు ఎంతమందికి ఇచ్చాడని, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడని ప్రశ్నించారు. గజ్వేల్‌ను వదిలి సిద్దిపేటకో, సిరిసిల్లకో పోకుండా కామారెడ్డికి రావడంలోనే మతలబు ఉందన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ను తాత్కాలికంగా రద్దు చేసినా, ఎన్నికల తరువాత మళ్లీ తెరపైకి తెచ్చి భూములను లాక్కుంటారని వివరించారు. తెలంగాణ దశ, దిశను మార్చే తీర్పును దేశమంతా గమనిస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఓటుకు రూ.పది వేలు ఇచ్చి, రూ.పదివేల కోట్ల విలువైన భూములు లాక్కుంటారని ఆరోపించారు.  

వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం.... 
పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్‌ వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని చెప్పి వైశ్యులను మోసం చేశాడని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందని రేవంత్‌ చెప్పారు. గల్ఫ్‌ కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వారికి అండగా ఉంటామని, కామారెడ్డిలో పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అందరూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు