పట్టాభితో బూతు డ్రామాలు.. కుప్పంలో బాంబు డ్రామాలు: ఆర్కే రోజా

30 Oct, 2021 13:43 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎంత ఫ్రస్టేషన్‌లో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ ఫ్రస్టేషన్‌లో నగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులున్నారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నగరి మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులపై మునిసిపల్ కౌన్సిల్ ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. బాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రా.. లేక వీధి రౌడీనా?. ముందు 'యధా రాజా తథా ‍ప్రజా' అంటారు. అయితే ఇప్పు‍డు 'యధా రాజా తథా చంద్రబాబు' అన్నది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకే సరిపోతుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా చేసి ఈ రోజు జగన్‌మోహన్ రెడ్డి నీరు ఇవ్వలేదని విమర్శించడం ఎక్కడి న్యాయం?. కుప్పంలో కనీసం ఇళ్లు, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి ఈ రోజు ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పదం. సిగ్గు లేకుండా కుప్పానికి రండి తేల్చుకుందాం అని పిలుస్తున్నారు.

చదవండి: (అప్పట్లో కన్నీళ్లు.. ఇప్పుడు ఒంగి ఒంగి దండాలు.. మిగిలినదంతా సేమ్‌ టు సేమ్‌..)

కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. గత వారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి ప్రజలని నమ్మించాలని చూస్తే ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. కుప్పంలో ఏ ఎలక్షన్స్ జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగన్‌మోహన్‌ రెడ్డికే పట్టం కడతారనే విషయాన్ని చంద్రబాబు ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు. టీడీపీ అధినాయకుడు చంద్రబాబు క్యాడర్ మొత్తం చేజారి పోతుందన్న భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే చరిత్ర హీనుడిగా మిగిలి పోతారు' అని ఆర్కే రోజా హెచ్చరించారు.

మరిన్ని వార్తలు