కరోనా సాకు చెప్పి ఎన్నికలు అడ్డుకుంటున్నారు: సజ్జల

24 Mar, 2021 17:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఆనాడు ఎన్నికలు వాయిదా వేయమని కోరితే పట్టించుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ ఇప్పుడేమో 6 రోజుల్లో పూర్తయ్యే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికకు వ్యాక్సినేషన్‌ సాకు చెప్పి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తాము ఈ 6 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసి కోవిడ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల కమిషనర్‌ను కూడా తాము అదే కోరతామని సజ్జల స్పష్టం చేశారు. 

ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం
కోవిడ్‌ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కోటి మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షంలో ఉండగా చాలా పోరాడినమని, ఆనాడు చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన పనికి ఆరోజే హోదా డిమాండ్‌ సగం చచ్చిపోయిందని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం తాము అన్ని విధాలా పోరాడతామని పేర్కొన్నారు. చంద్రబాబులా దొంగాట ఆడకుండా నిరంతర పోరాటం చేస్తూనే ఉంటామని వివరించారు. 

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేం
మరోవైపు రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. తన పదవీకాలం ఈనెల 31తో ముగుస్తుందని, తర్వాత వచ్చే కమిషనర్ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

చదవండి: వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం పెంచాలి: సీఎం జగన్‌‌

మరిన్ని వార్తలు