లిక్కర్‌ స్కాంలో ఆప్‌ నేత మనీష్‌ సిసోడియాకు దక్కని ఊరట

30 Oct, 2023 10:49 IST|Sakshi

 సుప్రీంకోర్టు సిసోడియాకు లభించని ఊరట

మరో ఆరు నెలలు జైల్లోనే!

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశే ఎదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో కేసు విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హాజరయ్యారు. మనీష్ సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలను వినిపించారు.

రూ. 338 కోట్ల బదిలీకి సంబంధించి సందేహాస్పదమైన కొన్ని అంశాలున్నందవల్లే బెయిల్‌ను తిరస్కరించామని జస్టిస్ ఖన్నా అన్నారు. విచారణ నెమ్మదిగా సాగితే సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
 తాజా తీర్పుతో  సిసోడియాకు మరో ఆరు నెలల పాటు జైలులోనే ఉండనున్నారు.

అయితే, ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టయిన సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో తన తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై అక్టోబర్‌ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో విచారణకు ఎంత సమయం పడుతుందని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది. 

కాగా ఈ ఏడాది  ఫిబ్రవరిలో మద్యం కుంభకోణంలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి  జైల్లోనే ఉన్నారు. అరెస్టయిన సమయంలో  ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.   ఈ కేసు నేపథ్యంలో ఫిబ్రవరి 28న క్యాబినెట్‌కు రాజీనామా చేశారు.

లిక్కర్‌ స్కాంలో మనీష్‌ సిసోడియా
♦ ఈ కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారులుబదులుగా కొంతమంది వ్యాపారులకు మద్యం లైసెన్స్‌లు మంజూరు చేసేందుకు సహకరించారనే ఆరోపణలు
♦  కొందరు మద్యం విక్రయదారులకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ఎక్సైజ్ పాలసీని మార్చారని అభియోగాలు
♦  ఫిబ్రవరి 26న సిసోడియాను  అరెస్టు చేసిన సీబీఐ
♦   ఎక్సైజ్ శాఖతో సహా 18 పోర్ట్‌ఫోలియోలను  నిర్వహిస్తున్న సిసోడియా ఫిబ్రవరి 28న క్యాబినెట్‌కు రాజీనామా
♦  మనీలాండరింగ్ కేసులో మార్చి 9న తీహార్ జైలులో విచారించిన తర్వాత  ఈడీ అరెస్టు చేసింది. 
♦  "హై ప్రొఫైల్"   వ్యక్తి అంటూ  మే 30న సీబీఐ కేసులోబెయిల్ నిరాకరించిన హైకోర్టు
♦   జూలై 3న మనీలాండరింగ్ కేసులో కూడా  బెయిల్‌ను తిరస్కరణ
♦  సిసోడియాను  సుదీర్ఘ కాలం కటకటాల వెనుక ఉంచలేరు, ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి- సుప్రీం
♦  విశ్లేషణలో కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్న నేపథ్యంలో బెయిల్‌  తిరస్కరించినట్టు తాజాగాపేర్కొన్న సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు