ఇళ్లపైకి ‘పచ్చ’దొంగలు.. జాగ్రత్త! 

22 Nov, 2023 07:44 IST|Sakshi
ఓటర్ల సెల్‌ఫోన్‌ నంబర్‌ను టీడీపీ యాప్‌లో నమోదు చేయగా, వచ్చిన ఓటీపీ, సందేశం

ఒకేసారి ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ కుట్ర..

లేని మేనిఫెస్టో పేరుతో ఇళ్లల్లోకి జొరబడుతున్న పచ్చ దొంగలు

బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో బురిడీ

వచ్చే ఐదేళ్లలో లక్షల్లో లబ్ధి అంటూ ప్రజలకు ప్రలోభాలు

ఇది సైబర్‌ క్రైం కిందకు వస్తుంది.. ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కూడా..

ఓటరు కార్డు తీసుకుని ఈసీ నిబంధనల ఉల్లంఘన..

ప్రజల ప్రాథమిక హక్కులకూ భంగం 

మాయల పకీరు చేతిలో ప్రజల డేటా.. అందరూ అప్రమత్తంగా ఉండాలి

ప్రజలకు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల విజ్ఞప్తి

సాక్షి, అమరావతి :  టీడీపీకి చెందిన పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీదకొచ్చి పడుతోందని.. పట్టపగలే ఇళ్ల­లోకి చొరబడుతోందని.. ఆ ముఠా చేసే తప్పు­డు ప్రచారాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సల­హా­దారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తిచేశారు. నరనరాన వికృత ఆలోచ­నల మనస్తత్వం ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కంటే అంతర్జాతీయ దొంగల ముఠా­నే నయమంటూ ఆయన ఎద్దేవా చేశారు.

మోసం చేయడంలోనూ.. కొత్తకొత్త కిటుకులను వినియోగించి మళ్లీ ఐదు కోట్ల మంది ప్రజలను భ్రమల్లో పెట్టి.. రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసేందుకు టీడీపీ తెగబడుతున్న తీరు ఈ మధ్య రాజంపేటలో బయటపడిందని ఆయన గుర్తుచే­శారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­ల­­యంలో మంగళవారం ఆయన మీడియా­తో మాట్లాడుతూ.. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ చేస్తున్న మోసాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

లేని మేనిఫెస్టోతో ప్రలోభాలు..
ఇటీవల రాజంపేటలో రెండు సంఘటనలు జరిగాయి. అసలు టీడీపీ మేనిఫెస్టో ఏంటో కూడా ఇంకా పూర్తిగా తెలీదు. చంద్రబాబు ఏదో సూపర్‌ సిక్స్‌ అన్నారు.. దత్తపుత్రుడు చెప్పినవి కలిపి 11 హామీలు అంటున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో వాటిని ఖరారు చేసేందుకు నాటకాలు ఆడుతున్నారు. నిజానికి.. మేని­ఫెస్టోపై స్పష్టత లేకున్నా.. ‘బాబు ష్యూరిటీ–­భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ కార్య­కర్తలు ఇప్పుడు ఇళ్లల్లోకి చొరబడుతు­న్నారు.

ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుని ఒక యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఓటీపీ వస్తే క్లిక్‌ చేయమంటున్నారు. దాన్ని క్లిక్‌చేస్తే ‘భవిష్య­త్తుకు గ్యారెంటీ’ అంటూ కార్డు వస్తోంది. ఆ కార్టులో.. ‘ఐదేళ్లలో రూ.2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు.. మీకు అభినందనలు.. 2024 జూన్‌ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమచేయడం ప్రారంభమవుతుంది’ అంటూ ఇటీవల రాజంపేటకు చెందిన మర్రి మౌనికకు చెప్పారు.

చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకంచేసి మరీ ఒక గ్యారెంటీ పత్రం ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఓటరు కార్డు నంబరు, మొబైల్‌ నంబర్‌తో సహా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. మరో ఇంటికెళ్లి రూ.6.90 లక్షలు వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని చాపకింద నీరులా టీడీపీ వాళ్లు నిర్వహిస్తున్నారు.

ప్రజల వ్యక్తిగత డేటా చోరీ..
నిజానికి.. హామీలను రాతపూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో. అధికారంలోకి వస్తే దాన్ని అమలుచేయాలి. కానీ, 2014లో టీడీపీ తన హామీలను అమలు చేయలేక మోసం చేసింది. అప్పట్లో మోదీ, పవన్‌కళ్యాణ్‌ ఫొటోలతో 650 హామీలను అమలు చేస్తానంటూ ప్రజలకు సంతకం చేసి మరీ చంద్రబాబు లేఖలు రాశారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోను అమలుచేయకుండా.. దానిపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో టీడీపీ వెబ్‌సైట్‌ నుంచే దాన్ని మాయంచేశారు.

ఇప్పుడు లేని మేనిఫెస్టోతో మళ్లీ ప్రజల వద్దకు చంద్రబాబు వెళ్తున్నాడు. ఇంటింటికీ వెళ్లి మీకు పథకాలు వచ్చేశాయి.. అభినందనలు.. అంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. వారెంటీ లేని గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తున్న ఇతన్ని ఏ చట్టం ప్రకారం శిక్షించవచ్చో ప్రజలే ఆలోచించాలి. ఇక ఇది సైబర్‌ క్రైం కిందకు వస్తుంది. ఓటరు కార్డు కూడా తీసుకుని పౌరుల వ్యక్తిగత గోప్యతలోకి కూడా వచ్చేస్తున్నారు.

ముఖ్యంగా ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కిందకు కూడా వస్తుంది. ఓటరు కార్డు తీసుకుంటూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రజలకున్న ప్రాథమిక హక్కుల్లోకి కూడా వెళ్లిపోతున్నాడు. పచ్చి అబద్ధాలతో ఇళ్లలోకి వచ్చి ప్రజల రహస్యాలను టీడీపీ కార్యకర్తలు తస్కరిస్తు­న్నారు. ఈ డేటాను వారు ఎందుకైనా వాడుకోవచ్చు.. బ్లాక్‌మెయిల్‌ చేయవచ్చు.. ఇంకేదైనా చేయవచ్చు. ఇంత చేస్తున్న చంద్రబాబు గత చరిత్ర చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. 

‘సేవామిత్ర’తో 50 లక్షల ఓట్లు తొలగించిన బాబు..
తన హయాంలో చంద్రబాబు వ్యవస్థల్లోకి వైరస్‌లా దూరి వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించేందుకు తెగించాడు. అప్పట్లో సేవామిత్ర అనే ఒక యాప్‌ను తయారుచేసి ప్రత్యర్థి పార్టీ ఓట్లపై దెబ్బకొట్టే ప్రయత్నం చేశా­డు. బ్లూఫ్రాగ్‌ అనే కంపెనీకి పబ్లిక్‌ డేటా యాక్సెస్‌ ఇచ్చి, దాని ద్వారా ఐటీ గ్రిడ్స్‌కి పంపి చోరీ చేశారు. ఓటరు డేటానూ ఇదే రీతిలో చోరీచేశారు. వాటిని సేవామిత్ర యాప్‌లో పొందుపరిచి.. కుటుంబ ఆర్థిక వివరాల నుంచి మొబైల్‌ నంబర్, కుల వివరాలు, వృత్తి, విద్యార్హత వివరాలు సేకరించారు. 

♦ ఆ తర్వాత ఏ పేపరు చదవుతారని ప్రశ్నించి.. ‘సాక్షి’ పత్రిక చదువు­తున్నట్లు చెప్పిన ఓటర్లు, వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉంటామని చెప్పిన ఓటర్లను జాబితాను తొలగించేలా ఫారం–7లను సేవామిత్ర యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి పంపారు. అలా 50 లక్షల ఓట్లను 2017లో తొలగించారు. 

♦ ఇదే అంశంపై అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ గవర్నర్, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దాంతో.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 30 లక్షల ఓట్లను మళ్లీ సీఈసీ చేర్చింది. ఒకవేళ చంద్రబాబు కోరుకున్నట్లు 50 లక్షల ఓట్లు తొలగించి ఉంటే ఏం జరిగి ఉండేది? 

 అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులైన ఓటర్లను తొలగించిన చంద్రబాబు.. ప్రతిపక్షంలోకి రావడంతో తిరిగి ఓటర్ల వద్దకు వెళ్లి అబద్ధపు హామీలతో ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. ఇది ప్రజల్ని మోసం చేసి వాళ్లకు భవిష్యత్తు లేకుండా, మళ్లీ చీకట్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మామూలు దొంగతనం, దోపిడీ కంటే మరింత భయంకరమైనది. 


చంద్రబాబు అధికారంలోకి వస్తే మీ కుటుంబం రూ.2.4లక్షలు లబ్ధి పొందేందుకు అర్హత సాధించింది.. అంటూ రాజంపేట నియోజకవర్గానికి చెందిన మౌనిక మర్రి అనే ఓటరుకు పంపిన సందేశం 

గజదొంగే దొంగా దొంగా అని అరుస్తున్నాడు..
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వ్యక్తిగత వివరాలను చోరీచేసిన డేటా చంద్రబాబు వద్ద ఉంది. ఇప్పుడు మళ్లీ వారి వ్యక్తిగత సమాచారాన్ని తన చేతిలో పెట్టుకుంటున్నాడు. మాయలపకీరు చేతులోకి డేటా అంతా వెళ్లే డేంజర్‌ పరిస్థితి ఇది. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం.  

♦ టీడీపీ చెప్పే మాటలు నమ్మితే 2014–19 మధ్యలో ఏం జరిగిందో ప్రజలు గుర్తు­తెచ్చుకోవాలి. నిలువుదోపిడీ చేయగల గజ­దొంగే.. ఎదుటి వాళ్లను చూసి దొంగ దొంగ అని అరుస్తున్నాడు. 
♦ చంద్రబాబు సేవలో తరిస్తూ ఎల్లో మీడియా చేస్తున్న అఘాయిత్యంపట్ల కూడా ప్రజలు జాగ్ర­­త్తగా ఉండాలి. టీడీపీ డ్రామాలను గమ­నించాలి. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 
 ఇక మోసం చేస్తున్నది వాళ్లు.. కానీ, ఉల్టా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. లక్షల ఓట్ల తొలగింపు అంటూ ఈనాడు బ్యానర్‌ వార్తలు రాస్తుంది. 5.78 లక్షల మంది వలస వెళ్లి­పో­యిన ఓటర్లను జాబితా నుంచి తొలగించారంటూ తప్పుడు కథనం రాశారు. అదే సమయంలో వలస వెళ్లిన వారిలో 5.47 లక్షల ఓటర్లను వాళ్లు నివాసం ఉన్నచోట చేర్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎవడైనా నిష్పక్షపాతంగా రాసేవాడైతే ఆ విషయాన్ని కూడా రాయాలి కదా?  రామోజీరావు ఒళ్లంతా పసుపే. ఈనాడు చంద్రబాబు కరపత్రం. దానికి మించి చంద్రబాబుకు రామోజీరావు రాజగురువు.  
 కుప్పం ఓటర్ల జాబితాలో కనికట్టు అంటూ మరో వార్త రాశారు. సత్యనారాయణరెడ్డి, షఫీయుల్లా అనే వ్యక్తులు చనిపోయినా ఓటర్ల జాబితాలో వారి ఓట్లు ఉన్నాయని రాశారు. వాటిపై చెక్‌ చేయిస్తే.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019, జనవరిలో వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండగా అవి ఇప్పుడూ కొనసాగుతున్నాయి. మేం అడు­గు­తోంది కూడా ఇలాంటి ఓట్లు తొలగించాలనే. 
 ఓటర్ల జాబితా రూపకల్పనలో సీఎం జగన్‌కు గానీ, ప్రభుత్వానికిగానీ ఏం పాత్ర ఉంటుంది? కానీ, చంద్రబాబుకు మాత్రం సంబంధం ఉంటుంది. ఎందుకంటే అడ్డదారుల్లో ఎలా అధికారంలోకి రావాలనే లక్షణం ఉంది కాబట్టి. గత రెండున్నర నెలలుగా రోజూ ‘ఈనాడు’లో ఇలా ఓటర్ల మీదే రాస్తున్నారు. 
 అడ్డంగా హత్యలు చేసే హంతకుడే తాను బాధితుడైనట్లుగా చంద్రబాబు వ్యవహ­రిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా ఆయన హత్య చేస్తున్నారు. 
♦ మరోవైపు.. 50 లక్షలు ఓట్లు తీసేయాలంటూ యాగీ చేస్తున్నారు. బతికి ఉన్న వాళ్లని కూడా చనిపోయారని ఫిర్యాదు చేసి ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. రోజూ మెమొ­రాండం తీసుకుని ఎన్నికల కమిషన్‌కు ఇస్తూ పోతున్నారు. తప్పుదోవ పట్టించడానికి విశ్వ­ప్రయత్నం చేస్తున్నారు. 
♦ 2014–19 మధ్యలో జరిగిన దానికంటే ఇప్పుడు మరిన్ని దారుణాలకు తెగబడుతున్నారు. 

ప్రపంచంలో చంద్రబాబే డీప్‌ఫేక్‌
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సేవా మిత్రల ద్వారా, నేడు జనం తిర­స్కరించాక ఇలాంటి బ్యూరో­క్రాట్స్‌ ద్వారా అడ్డదారులు తొక్కుతున్నాడు. పొద్దున లేచినప్పటి నుంచీ ఆ ఎల్లో పేపర్లలో, ఎల్లో టీవీల్లో చర్చలు పెట్టుకుంటూ వెళ్తారు. నీకు ఈ దౌర్భాగ్యం అవసరమా చంద్రబాబూ? దీనికంటే చేయగలిగింది రాయల్‌గా చెప్పొచ్చుగా? జగన్‌లా చేయగలిగిందే చెప్పాలి. రుణమాఫీ చేయలేమని ఆనాడు జగన్‌ స్పష్టంగా చెప్పారు.

ఎన్నికల ముందు కొంచెమన్నా చేస్తామని చెప్పాలని మాలాంటి వారు చెప్పినా ఆయన ససేమిరా అన్నారు. దానివల్ల నేను ప్రతిపక్షంలో కూర్చున్నా పర్లేదన్నారు. అదీ జగన్‌ నిబద్ధత. కానీ, చంద్రబాబు మాత్రం అడ్డదారులే వెతుక్కుంటున్నాడు. గోడ దూకడం ఎలా అని ఆలోచిస్తాడు. నిజానికి.. చంద్రబాబుకు 2014–19 మధ్య ప్రజలు మళ్లీ ఆయనకు అవకాశమిచ్చారు. అప్పుడైనా ప్రజలకు సేవ చేయాల్సింది. కానీ ఆయనకు ఆ లక్షణం లేదు. ప్రపంచంలోనే డీప్‌ ఫేక్‌ చంద్రబాబు. ఇంతకంటే డీప్‌ఫేక్‌ ఏదీ ఉండదు.

బ్యాంకుల్లో కుదవ పెట్టిన మీ బంగారాన్ని విడిపిస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఏం చేశాడో అందరూ చూశారు. చంద్రబాబుకు ఉన్న విశ్వసనీయత అక్రమాల్లోనే.  ఇక స్కిల్‌ స్కాంలో అరెస్టుకాకముందు ఏ రోగమూ లేని చంద్రబాబు.. అరెస్టయిన తర్వాత ప్రపంచంలోని అన్ని రోగాలున్నాయని కోర్టులకు చెప్పారు. మెడికల్‌ బెయిల్‌ వచ్చినా.. రెగ్యులర్‌ బెయిల్‌ వచ్చినా సత్యం గెలిచింది అంటారు. స్కాంస్టర్‌ బాబులో స్కాం మాత్రమే సత్యం.. చివరికి అదే బయటపడుతుంది. 

సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ పేరుతో తప్పుడు కేసులు..
ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్‌ వంటి వారితో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ వంటి సంస్థలను సృష్టించి, సుప్రీంకోర్టులో తప్పుడు కేసులు వేయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 50 లక్షల ఓట్లు తొలగించారు కదా.. దానికి మీరేం సమాధానం చెబుతారని నిమ్మగడ్డ రమేష్‌ నేతృత్వంలోని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంస్థలో భాగస్వాములైన వారిని మేం ప్రశ్నిస్తున్నాం. అప్పట్లో ఇదే సుబ్రహ్మణ్యం చీఫ్‌ సెక్రటరీగా కూడా ఉన్నారు.

ఆనాడు జరిగింది ఆయనకు తెలీదా? మరోవైపు.. గ్రామ, వార్డువలంటీర్లపై ఈ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లింది. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభుత్వ పథకాలు, సేవలను ఇంటి వద్దకే ప్రజలకు అందించడానికి వలంటీర్లు పనిచేస్తున్నారు. వారు ఉద్యోగులు కాదన్న విషయం వారికీ తెలుసు. రాజకీయంగా వలంటీర్‌ ఎవరికైనా మద్దతు పలకవచ్చు... అది వారి స్వేచ్ఛ.

గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలకు ఉన్న అధికారాలు వలంటీర్లకు లేవు కదా? వాటిలా దోపిడీ ముఠాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సృష్టించలేదు కదా? ఇక ఈ కేసులో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంస్థకు లాయర్‌ కపిల్‌ సిబాల్‌. ఆయన ఫీజు కోట్ల రూపాయలు తీసుకుంటారు. అంత సొమ్ము ఈ సంస్థకు ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు.. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీసంస్థను ఆడిస్తున్నాడు. ఇంతకంటే ఇంకేముంది.

మరిన్ని వార్తలు