ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఎఫెక్ట్‌.. అఖిలప్రియకు షాక్‌!

17 May, 2023 16:26 IST|Sakshi

సాక్షి, నంద్యాల: టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బిగ్‌ షాక్‌ తగిలింది. తాజాగా అఖిలప్రియకు టీడీపీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి విషయంలో వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని అఖిలప్రియకు పార్టీ షోకాజ్‌ నోటీసులు పంపించింది. 

ఇదిలా ఉండగా.. నంద్యాలలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి  క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గా­య పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరోవైపు, ఈ దాడి ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో భూమా అఖిలప్రియపై ఘాటు విమర్శలు చేశారు. అఖిల ప్రియకు టికెట్ ఇవ్వడం అంటూ జరిగితే ఆమె పతనం కోసం పని చేస్తామని సంచలన కామెంట్స్‌ చేశారు. అఖిల ప్రియను ఓడించడానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని జశ్వంతిరెడ్డి అన్నారు. రోడ్డు మీద, బరి తెగించి.. ఎత్తుకుని పెంచిన ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ దాడి చేయడం ద్వారా తన స్థాయి ఏమిటో నిరూపించుకుందని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తాను గానీ, తన తండ్రి గానీ ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. అఖిల ప్రియ వంటి నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని సూచించారు. 

(చదవండి, జశ్వంతి వీడియో చూడండి : అఖిలప్రియ గురించి ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి ఏమి చెప్పిందంటే.?)

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు కొత్త టెన్షన్‌.. షాకిచ్చిన ఏవీ సుబ్బారెడ్డి!

మరిన్ని వార్తలు