ఇటు కళకళ.. అటు వెలవెల! 

23 Feb, 2021 06:53 IST|Sakshi
చిత్తూరు నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం- టీడీపీ జిల్లా కార్యాలయం

పురపోరుకు ఉరకలేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

నిస్తేజంలో టీడీపీ నాయకులు

పోటీకి ఆసక్తి చూపని తమ్ముళ్లు  

పైన కనబడుతున్న చిత్రాలను పరిశీలిస్తే.. చిత్తూరు నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి గతంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు.. టికెట్‌ కన్‌ఫర్మ్‌ చేసుకోవడానికి మద్దతుదారులతో సోమవారం పార్టీ కార్యాలయం వద్ద ఇలా క్యూకట్టారు. ఎవరికి బి–ఫామ్‌ ఇవ్వాలనేదానిపై జిల్లా నాయకులు బిజీబిజీగా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ఇది. 50 డివిజన్లు ఉన్న చిత్తూరు కార్పొరేషన్‌కు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క గతంలో చచ్చీచెడీ పలువురితో నామినేషన్లు వేయించారు. ప్రస్తుతం ఆ నామినేషన్లు వేసినవాళ్లు తమకు బి–ఫామ్‌ వద్దని చెబితే ఏంచేయాలో తెలియక జిల్లా నాయకులు కార్యాలయానికి రాకుండా మొహం చాటేస్తున్నారు.

చిత్తూరు అర్బన్‌: జిల్లాలో పంచాయతీ సంగ్రామం సజావుగా ముగిసింది. నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఏకంగా 1150కు పైగా స్థానాల్లో గెలుపొందడంతో శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ఘోర పరాభవం మూటగట్టుకుని కుదేలవడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నిస్తేజం అలుముకుంది. మరో 20 రోజుల్లో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమవుతుంటే.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక టీడీపీ నాయకులు మల్లగుల్లాలుపడుతున్నారు.

ఇప్పటికే 25 వార్డుల ఏకగ్రీవం? 
జిల్లాలో చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పుత్తూరు, నగరి మున్సిపాలిటీలకు గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడం, కరోనాతో వాయిదా పడటం తెలిసిందే. ఆగినచోట నుంచే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్‌ కమిషనర్‌ ఇటీవల ఆదేశాలు ఇవ్వడంతో మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలుకానుంది. అయితే నామినేషన్లు వేసేటప్పుడే జిల్లా మున్సిపాలిటీల్లోని మొత్తం 248 వార్డులకు గాను 25 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది.

చదవండి:
ఆరు చోట్ల టీడీపీ జీరో 
కుప్పకూలిన చంద్రబాబు సామ్రాజ్యం

     

మరిన్ని వార్తలు