గొప్ప సందేశం ఇచ్చే చిత్రంగా 'పోలీస్ వారి హెచ్చరిక'

17 Nov, 2023 13:44 IST|Sakshi

అభ్యుదయ దర్శకుడు 'బాబ్జీ'- తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్ధన్ తన తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం 'పోలీస్ వారి హెచ్చరిక'. ఈ  చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. దసరా పండగ రోజున ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ చిత్రం తాలుకు షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పటికే సుమారు 50 శాతం షూటింగ్‌ పూర్తి అయింది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌లో సినిమాలోని కీలక ఘట్టాలతో పాటు మూడు పాటలు, రెండు ఫైట్‌లను చిత్రీకరించారు.

 డిసెంబర్ మొదటివారంలో ఈ చిత్రం తాలూకు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని  దర్శకుడు బాబ్జీ తెలిపారు. ఈ సినిమ కథ గురించి ఆయన ఇలా చెప్పాడు. 'మన పిల్లలకు, మన కుటుంబానికి పంచే ప్రేమలో కొంతయినా మన చుట్టూ వుండే అనాథ బాలలకు కూడా పంచాలి. మన పిల్లల భవిష్యత్ గురించి చేసే ఆలోచనలో, తీసుకునే జాగ్రత్తలో కొంతయినా మన కళ్ల ముందు తిరుగుతున్న అనాథల విషయంలో ప్రదర్శించకపోతే వారు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో చిక్కుకొని సమాజాన్ని నాశనం చేసే నేరస్థులుగా మారే ప్రమాదం ఉందని చెప్పడమే ఈ 'పోలీస్‌ వారి హెచ్చరిక'. అని ఆయన చెప్పారు.

ఈ సినిమా గురించి నిర్మాత బెల్లి జనార్ధన్ ఇలా చెప్పారు. ' భారత సైన్యంలో దేశరక్షణ కోసం పనిచేసిన నేను మొట్టమొదటి సారిగా సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాను , దర్శకులు బాబ్జీ చెప్పిన కథలో ఉన్న సమాజానికి, దేశానికి ఉపయోగపడే గొప్ప సందేశం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. నటీనటులు, సాంకేతిక వర్గం మనస్ఫూర్తిగా అందిస్తున్న సహకారంతో ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయబోతున్నాం.' అని నిర్మాత పేర్కొన్నారు. పాన్ ఇండియా నటుడిగా ఎదుగుతున్న అజయ్ ఘోష్ గతంలో ఏ చిత్రంలోనూ చేయని గొప్ప పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారని, ఆ పాత్ర ఈ చిత్రానికే ఆయువు పట్టు లాంటిదని నిర్మాత బెల్లి జనార్దన్ తెలిపారు.

మరిన్ని వార్తలు