టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడాలి: షర్మిల 

21 Nov, 2022 02:33 IST|Sakshi
పరకాలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న షర్మిల 

పరకాల/కమలాపూర్‌: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కుటుంబం తప్ప ఏ ఒక్క కుటుంబం బాగుపడలేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటపై నిలబడని కేసీఆర్, టీఆర్‌ఎస్‌ పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 3,300 కి.మీ. దాటి హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం వంగపల్లి నైట్‌ క్యాంప్‌ నుంచి లక్ష్మీపూర్, శనిగరం మీదుగా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామం, నర్సక్కపల్లె గ్రామం మీదుగా ఆదివారం పరకాల పట్టణానికి చేరుకుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, రైతులకు, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల్లో టీఆర్‌ఎస్‌ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ఏ ఒక్క హామీని అమలు చేయలేదంటూ కేసీఆర్‌ పాలనను ఎండగట్టారు. అటు ప్రధాని మోదీ.. ఇటు కేసీఆర్‌ ఇద్దరూ కలిసి రైతుబంధు పథకాల పేరిట రైతులను ఆగం చేస్తూ వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారని షర్మిల ధ్వజమెత్తారు. 

మరిన్ని వార్తలు