కేసీఆర్‌ గజ్వేల్‌లో హ్యాట్రిక్‌ కొడతారా?

2 Dec, 2023 13:47 IST|Sakshi

కేసీఆర్‌ గజ్వేల్‌లో హ్యాట్రిక్‌ కొడతాడు!.. నా పందెం ఇంత
లే.. గజ్వేల్‌లో ఈటలనే గెలుస్తాడు! అంతకంటే డబుల్‌ నా పందెం

హరీష్‌రావు లాస్ట్‌ ఎలక్షన్‌ల వచ్చిన మెజారిటీ ఈసారి క్రాస్‌ చేస్తాడని నా బెట్‌
దాటడని నా బెట్‌

ఖమ్మంలో  పువ్వాడ-తుమ్మల పోటీలో గెలుపు ఆయనదే.. 

బర్రెలక్క ఈ ఎలక్షన్స్‌లో కచ్చితంగా గెలుస్తుందని ఇంత సొమ్ము వేస్తున్నా.. 


మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎవరు గెలుస్తారనే  ఉత్కంఠ అంతటా నెలకొంది. ఈ సమయంలోనే పందెం రాయుళ్ల జోరు పెంచారు.  గత నెల రోజుల నుంచి ఎలక్షన్‌ బెట్టింగ్‌ ఈ తంతు నడుస్తున్నప్పటికీ.. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు, కౌంటింగ్‌కు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు పందెం కాసే సొమ్ము అమాంతం పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పెద్ద లీడర్‌ సాబ్‌ల మీద, తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందన్న దానిపై బెట్టింగ్‌ నడుస్తున్నట్లు సమాచారం. 

కాయ్‌ రాజా కాయ్‌..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. నేతల మీద జోరుగా బెట్టింగ్‌ నడుస్తోంది. మొత్తం 33 జిల్లాల్లో.. ఎంపిక చేసిన నేతలపైనే పందేలు వేస్తున్నారు. బెట్టింగ్స్‌ కోసమే  సర్వేలు చేయించుకున్న కొందరు.. లక్షల నుంచి కోట్లలో కాస్తున్నారు.   ముఖ్య నేతల మీద, మంత్రుల గెలుపోటముల మీద ఓ లెక్క లేకుండా వేస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు.. ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నారు. హైదరాబాద్ సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఏపీకి సమీపంలో ఉన్న ప్రాంతాలపై బెట్టింగ్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

షాకింగ్‌ బెట్‌. ఇంట్రెస్టింగ్‌ రేటు
దుబ్బాకలో రఘునందన్‌రావు గెలుస్తాడా? ఓడిపోతాడా?.. సంగారెడ్డిలో రఘునందన్‌రావు మళ్లీ నెగ్గుతాడా?ఇలా.. ఆప్షన్‌లతో బెట్టింగులు నడుస్తున్నాయి. కామారెడ్డి, గజ్వేల్‌ మీద బెట్టింగ్‌ ముఠాల స్పెషల్‌ ఫోకస్‌ ఉంది. ఈ రెండు సెగ్మెంట్‌లలో కేసీఆర్‌ పోటీ చేస్తుండడమే ప్రధాన కారణమని చెపనక్కర్లేదు. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ విజయం సాధిస్తారు అనేదానికంటే.. గజ్వేల్‌లో ఈటల నెగ్గుతారనే ఇంకా ఎక్కువ సొమ్ముతో పందెం వేస్తున్నారు. అంతెందుకు విదేశాల నుంచి కూడా యాప్స్‌ బెట్టింగ్‌ వ్యవహారం నడుస్తోందని టాక్‌. 

సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్‌రావు గత ఎన్నికల్లో 1 లక్షా 19 వేల మెజారిటీ సాధించారు. ఈసారి ఆ మెజారిటీ రికార్డును దాటేస్తారా? అని పందెం వేస్తున్నారు. పలువురు తెలంగాణ మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు పందెం రాయుళ్లు. ఖమ్మంలో తుమ్మల-పువ్వాడ ఫైట్‌ మీద, పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓడిపోతారని,  కేటీఆర్‌ మెజార్టీ ఎలా ఉండబోతుందని, ఆదిలాబాద్‌-కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కు జీరో సీట్లు అని.. ఇలా రకరకాల ఆఫ్షన్‌లతో పందెలు వేస్తున్నట్లు తెలుస్తోంది.   

పైసలే కాదు.. 
పొలిటికల్‌ బెట్టింగ్‌లో.. డబ్బులే కాదు భూములను కూడా పందెంలో పెడుతున్నారు కొందరు. సిర్పూర్‌ నియోజకవర్గం పరిధిలో గెలుపోటములపై లక్షల్లో సొమ్ముతో పాటు పొలాలను కూడా కొందరు తాకట్టు పెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల బెట్టింగ్‌ విలువ రూ.10 వేల కోట్ల రూపాయల దాకా ఉండొచ్చనేది ఒక అంచనా.

మరిన్ని వార్తలు