-

కారులోనే యువకుడి సజీవ దహనం

27 Nov, 2023 12:57 IST|Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: అర్ధరాత్రి ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు దగ్ధమై యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం.. సూర్యపేట జిల్లా జ్యోతినగర్‌, నాయనగర్‌ ప్రాంతానికి చెందిన బడుగుల వెంకటేశ్‌ (25) శనివారం సాయంత్రం సూర్యపేట నుంచి హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడకు కారులో బయలుదేరాడు.

బొంగ్లూర్‌ సమీపంలోని శ్రీశ్రీ ఎరోలైట్స్‌ వద్దకు రాగానే కారు ఆపి సీటు వెనక్కి తీసుకొని నిద్రిస్తున్నాడు. అంతలోనే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్పటికే నిద్రలో ఉన్న వెంకటేశ్‌ కారులోనే ఉండిపోయాడు. పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయని అర్ధరాత్రి 1.20 గంటలకు ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే కారులో ఉన్న వెంకటేశ్‌ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. క్లూస్‌ టీం సహకారంతో కారు నంబర్‌ గుర్తించారు. అందులో ప్రయాణిస్తున్నది బడుగుల వెంకటేశ్‌(25)గా నిర్ధారించారు. వెంకటేశ్‌ కొద్ది రోజుల్లో ఉన్నత చదువుల నిమిత్తం కెనడాకు వెళ్లనున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు చెప్పినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు