10 రోజుల క్రితం మహిళ మృతి.. పూడ్చిపెట్టిన శవానికి పోస్టుమార్టం

19 Sep, 2023 08:08 IST|Sakshi

దుబ్బాకరూరల్‌: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని హబ్సిపూర్‌ గ్రామంలో జరిగింది. సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. బైండ్ల బాలవ్వ(50) వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటుంది. భర్త ఆరేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లకు వివాహం కాగా, కుమారులు హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంటారు. ఈనెల 7న బాలవ్వ మృతి చెందగా ఇంటి ఎదుటఉన్నవారు కుమారులకు సమాచారం అందించారు.

మంచం మీద నుంచి కింద పడి మృతి చెంది ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు, బంధువులు అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటికే బాలవ్వ ముక్కు నుంచి రక్తం కారుతుంది. శవాన్ని దించుతుండగా మృతురాలి తల కిందఉన్న దిండు జారి కిందపడింది. దానిపై రక్తం మరకలు కనిపించాయి. అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటిలో కూడా రక్తం మరకలు ఉన్నాయి.

అనుమానం వచ్చి మృతురాలి కుమారులు నాగరాజు, పరుశరాములు ఈనెల 16న పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ కృష్ణ, ఎస్‌ఐ గంగరాజు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం పూడ్చిన శవాన్ని బయటకు తీసి అక్కడే తహసీల్దార్‌ జయంత్‌, ఫోరెనిక్స్‌ బృందం సభ్యుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానిత నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు