దుబ్బాకటౌన్: దుబ్బాకలోని 19వ వార్డు కౌన్సిలర్ ఎంగారి స్వప్న రాజిరెడ్డి ఇంట్లో ఫిబ్రవరి 27వ తేదీన దొంగతనానికి పాల్పడిని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సీఐ మున్నూరు కృష్ణ చోరీ కేసు వివరాలు వెల్లడించారు. సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన జంగోని సాయికుమార్(24) దొంగతనాలు చేస్తున్నాడు. దొంగతనం కేసులో పోలీసులకు పట్టుబడి ఫిబ్రవరి 15న బెయిల్పై విడుదలయ్యాడు. మళ్లీ ఫిబ్రవరి 27న ఇంటికి తాళం వేసి దుబ్బాక 19వ వార్డు కౌన్సిలర్ ఎంగారి స్వప్న రాజిరెడ్డి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించి ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి వస్తువులు సాయికుమార్ ఎత్తుకెళ్లాడు. ఇతడు ఆరు చోరీ కేసుల్లో నిందితుడని తెలిపారు. అతడి నుంచి ఐదు తులాల బంగారం, రెండు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న ఎస్ఐ మహేందర్, ఐడీ పార్టీ కానిస్టేబుల్ రాంజీని సీఐ ప్రత్యేకంగా అభినందించారు.