‘ఈ సీజన్‌లో ఆ రెండు జట్లే అత్యుత్తమం’

13 Oct, 2020 18:06 IST|Sakshi

ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరడం కష్టమే

అజిత్‌ అగార్కర్‌ విశ్లేషణ

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌ ప్రారంభమై 25 రోజులైంది. ఇంకా సుమారు నెల రోజుల ఆటే మిగిలి ఉండటంతో ఆయా జట్లపై తమ తమ అంచనాలను వెల్లడిస్తారన్నారు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు. ఈ క్రమంలోనే తన అత్యుత్తమ జట్లను ప్రకటించాడు టీమిండియా మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఎనిమిది ఫ్రాంచైజీలో కనబరుస్తున్న ఫామ్‌ను బట్టి ఒక అంచనాకు వచ్చాడు. వాటిలో తన రెండు బెస్ట్‌ జట్లను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌లే ఈ సీజన్‌ బెస్ట్‌ టీమ్స్‌ అని అభిప్రాయపడ్డాడు.  ఈ రెండు జట్లు కచ్చితంగా ప్లేఆఫ్‌ రేసులో ఉంటాయని జోస్యం చెప్పాడు. వీటితో పాటు కేకేఆర్‌కు ప్లేఆఫ్‌ అవకాశం ఉందన్నాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌ మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు వెళుతుందని పేర్కొన్నాడు. ఇక నాల్గో స్థానం కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాజస్తాన్‌ రాయల్స్‌ల మధ్య పోటీ ఉంటుందన్నాడు. (నీ రీఎంట్రీకి ఇది చాలు: రవిశాస్త్రి)

కాగా, వరుస విజయాలు సాధిస్తున్న ఆర్సీబీపై తనకు ఇంకా నమ్మకం ఏర్పడలేదన్నాడు. ఆ జట్టు ప్లేఆఫ్‌కు వెళుతుందని తాను విశ్వసించడం లేదన్నాడు. ఈ మేరకు ఏఎన్‌ఐతో మాట్లాడిన అగార్కర్‌.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంచితే, ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లను బట్టి చూస్తే ముంబై ఇండియన్స్‌(7 మ్యాచ్‌లకు గాను ఐదు విజయాలు) తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్‌(7 మ్యాచ్‌లకు గాను ఐదు విజయాలు ఐదు విజయాలు) రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ కూడా(7 మ్యాచ్‌లకు గాను ఐదు విజయాలు) మూడో స్థానంలో ఉంది.

ఇక కేకేఆర్‌( 7 మ్యాచ్‌లకు గాను నాలుగు విజయాలు) నాల్గో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌లు ఏడేసి మ్యాచ్‌లు ఆడి తలో మూడేసి విజయాలతో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇక సీఎస్‌కే రెండు విజయాలతో ఏడో స్థానంలో ఉండగా, కింగ్స్‌ పంజాబ్‌ ఒకే ఒక్క విజయంతో ఆఖరి స్థానంలో ఉంది. ఫలితంగా సీఎస్‌కే, కింగ్స్‌ పంజాబ్‌లు ప్లేఆఫ్స్‌కు చేరడం దాదాపు కష్టమే.ఏమైనా అద్భుతాలు జరిగితే తప్పితే ఇవి ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవడం అంత ఈజీ కాదు. ఇక అన్ని జట్లు ఏడేసి మ్యాచ్‌లు ఆడేసి రెండో అంకంలోకి అడుగుపెడుతున్నాయి. (కోహ్లి.. ఇది ఓవరాక్షన్‌ కాదా?)

మరిన్ని వార్తలు